ఇమేజిని డ్యామేజ్ చేసిన పవన్..చంద్రబాబుకు షాక్

First Published Mar 15, 2018, 9:59 AM IST
Highlights
  • పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంరద్భంగా చంద్రబాబు, లోకేష్, టిడిపిలను ఉద్దేశించి పవన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, ఆరోపణలు చాలా భయంకరంగా ఉన్నాయి

రాబోయే ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏం చేస్తారో తెలీదు కానీ ఇప్పటికైతే చంద్రబాబునాయుడును బాగా డ్యామేజ్ చేసేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంరద్భంగా చంద్రబాబు, లోకేష్, టిడిపిలను ఉద్దేశించి పవన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, ఆరోపణలు చాలా భయంకరంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే  వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంత చేటు ఆరోపణలు ఎప్పుడూ చేయలేదేమో అని అనిపిస్తోంది.

అసలు పవన్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుని చంద్రబాబుపై అంతలా ఎందుకు విరుచుకుపడ్డారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే, మొన్నటి వరకూ చంద్రబాబు-పవన్ ఒక్కటే అన్న అభిప్రాయం జనాల్లో బలంగా నాటుకుపోయింది. పార్టీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ, ‘పవన్ మనవాడే ఎవరు ఏమనవద్దు’ అని ఎన్నోసార్లు చెప్పారు. అదే విధంగా పవన్ వైఖరి కూడా ఆ విధంగానే ఉండేది.

అటువంటిది బుధవారం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా పవన్ విరుచుకుపడటాన్ని టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు, లోకేష్ కూడా పవన్ పై మండిపోతున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అందుకనే చంద్రబాబుపై పనవ్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు నిరసనగా టిడిపి శ్రేణులు రాష్ట్రంలో అనేక చోట్ల నిరసన తెలిపారు. కొన్ని చోట్ల పవన్ దిష్టిబొమ్మలను కూడా తగలబెట్టారు.

గడచిన మూడున్నరేళ్ళల్లో ఇటువంటి పరిస్దితి తలెత్తటం ఇదే మొదటిసారి. అదికూడా ఎన్నికలు తరుముకొస్తున్న నేపధ్యంలో పవన్ చేసిన ఆరోపణలకు ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే, ఇవే ఆరోపణలు జగన్, వైసిపి నేతలు ఎప్పటి నుండో చేస్తున్నవే. కాకపోతే నమ్మకమైన మిత్రునిగా ఉన్న పవన్ అవే ఆరోపణలు చేసి  ఇమేజిని డ్యామేజి చేయటమే చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. పవన్ చేసిన తాజా ఆరోపణలు జగన్ ఎప్పటి నుండో చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లైంది. మరి, డ్యామేజి కంట్రోలుకు చంద్రబాబు ఏం చేస్తారో  చూడాల్సిందే.

click me!