నియోజకవర్గానికి 25 కోట్లు పంపిణీ: లోకేష్ పై పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణ

Published : Oct 02, 2018, 07:19 PM ISTUpdated : Oct 02, 2018, 08:49 PM IST
నియోజకవర్గానికి 25 కోట్లు పంపిణీ: లోకేష్ పై పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణ

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికల్లో గెలించేందుకు టీడీపీ డబ్బులు వెదజల్లేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

జంగారెడ్డి గూడెం:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికల్లో గెలించేందుకు టీడీపీ డబ్బులు వెదజల్లేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఒక్కో నియోజకవర్గానికి 25 కోట్లు ఖర్చుపెట్టి అధికారంలోకి రావాలని పరితపిస్తున్నారని ధ్వజమెత్తారు. 2019 రాజకీయాల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయని తెలిపారు. 

ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో పర్యటిస్తున్న పవన్ డబ్బుంటే ముఖ్యమంత్రులు కాలేరన్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రధానం కాదన్న ఆయన డబ్బే ప్రధానమైతే వైసీపీ అధినేత జగన్‌ ఎప్పుడో సీఎం అయిపోయేవారన్నారు. అటు దేశంలోనూ ఇటు ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ముఖేశ్‌ అంబానీ ప్రధాని అయ్యేవారన్నారు. డబ్బు కాదని ప్రజల గుండెల్లో ప్రేమే సీఎంని చేస్తుందని అభిప్రాయపడ్డారు. 

మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అనుభవంపై తనకు అపారమైన నమ్మకం ఉందని, సుదీర్ఘకాలంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. అందుకే తాను తనకు జీవితాన్నిచ్చిన అన్నయ్య ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని చంద్రబాబుకు మద్దతిచ్చానని గుర్తుచేశారు. నేను మద్దతిచ్చి ఉండకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని పవన్ అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో చంద్రబాబు నాయుడు పొత్తుపెట్టుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు ఏ పార్టీతో పొత్తుపెట్టుకుంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ జనసేన మేనిఫెస్టోని కాపీ కొట్టి మేనిఫెస్టోని తయారు చేసిందన్నారు. జనసేన మేనిఫెస్టోలో ఉన్న అన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టేసిందని విమర్శించారు. 

మరోవైపు మంత్రి నారా లోకేష్ 14వేల కిలోమీటర్లు రహదారులు వేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని అయితే జంగారెడ్డి గూడెంలో రోడ్లు నడవటానికి కూడా వీలులేకుండా ఉన్నాయని విమర్శించారు. అమరావతి నిర్మాణానికి అక్కడి రైతులకు బాండ్లు ఎలా అయితే ఇచ్చారో పోలవరం నిర్వాసితులకు కూడా బాండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని, వారికి అండగా ఉంటానని పవన్‌ హామీ ఇచ్చారు. 

అటు చట్టసభల్లో ఆడపడుచులకు 33శాతం రిజర్వేషన్లు ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. మహిళలు పడుతున్న కష్టాలు తనకు తెలుసు గనకే ఉచిత గ్యాస్‌ సిలిండర్ల అంశాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టామని పవన్‌ చెప్పారు. అలాగే ప్రతీ నెల మహిళల అకౌంట్లో రూ.2500 జమ చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కిలోరూపాయికే బియ్యం ఇస్తున్నారని అవి తినేందుకు పనికి రావన్నారు. అవి మెులాసిస్ కు పనికొచ్చే బియ్యమన్నారు.   

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్