లాంగ్ మార్చ్ ను ఆపడానికి జగన్ సర్కార్ కుట్రలు: పవన్ కళ్యాణ్

By telugu teamFirst Published Nov 2, 2019, 1:33 PM IST
Highlights

ఇసుక కొరతనయు నిరసిస్తూ, భావన నిర్మాణ కార్మికులకు మద్దతుగా తాను తలపెట్టిన లాంగ్ మార్చ్ ను అడ్డుకోవడానికి జగన్ సర్కార్ కుట్రలు పన్నుతోందని, అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తుందని జనసేనాని ఆరోపించారు. 

విశాఖ: పవన్ కళ్యాణ్ భావన నిర్మాణ కార్మికులకు మద్దతుగా రేపు ఆదివారం నవంబర్ 3వ తారీఖున లాంగ్ మార్చ్ చేపట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తన లాంగ్ మార్చ్ ను దెబ్బతీసేందుకు అధికార వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. 

తన లాంగ్ మార్చ్ కు అనుమతి లభించలేదని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారని, ఆ మాటలను, అలంటి అబద్ధపు వార్తలను నమ్మవద్దని పవన్ తెలిపాడు. 

అనుమతి నిరాకరించారంటూ జరుగుతున్న ప్రచారం వైసీపీ కుట్రని ట్విట్టర్ వేదికగా తెలిపారు. మరింత క్లారిటీ ఇచ్చేందుకు, ఈ పుకార్లకు చెక్ పెట్టేందుకు లాంగ్ మార్చ్ కి అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని జత చేసారు. 

ఇకపోతే రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ పవన్ కళ్యాణ్ చలో విశాఖకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు విశాఖ వేదికగా నవంబర్ 3న లాంగ్ మార్చ్ కు పిలుపు ఇచ్చారు.  

ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మద్దెలపాలెం తెలుగు తల్లి విగ్రహం దగ్గర పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల లాంగ్ మార్చ్ నిర్వహించనున్నారు. జీవీఎంసీ కార్యాలయం సమీపంలోని గాంధీ విగ్రహం వరకు లాంగ్ మార్చ్ కొనసాగనుంది. 

అయితే లాంగ్ మార్చ్ అనంతరం విశాఖ సెంట్రల్ పార్క్ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు జనసేన నేతలు ప్రయత్నిస్తున్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ నాగబాబు, విశాఖపట్నం నేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

అయితే విశాఖ సెంట్రల్ పార్క్ దగ్గర బహిరంగ సభకు అనుమతి లేదంటూ అధికారులు అడ్డుకున్నారు. ఇప్పటికే లాంగ్ మార్చ్ కు జనసేన సన్నద్ధమైందని సభకు అనుమతి లేదని అడ్డుకుంటే ఎలా అంటూ నిలదీశారు. 

రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు రానున్నారని ఇలాంటి కార్యక్రమానికి అధికారులు అడ్డుకోవడం తగదని వారు అధికారులతో వాదించారు. అయితే అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో బహిరంగ సభపై టెన్షన్ నెలకొంది. 

ఇకపోతే లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలకు ఫోన్ చేశారు. ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో 30 లక్షల మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వారి పక్షాన పోరాడతామని అందుకు అంతా సహకరించాలని కోరారు. అయితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఫోన్ లో పవన్ కళ్యాణ్ కు తెలిపారు. 

ఈ నేపథ్యంలో శనివారం పవన్ కళ్యాణ్ కు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధులు స్వయంగా లేఖలు రాశారు. లాంగ్ మార్చ్ లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. లాంగ్ మార్చ్ కి తమతోపాటు బీజేపీని కూడా ఆహ్వానించడంతో తాము దూరం కావాల్సి వస్తుందని తెలిపారు. 

ఇకపోతే పవన్ లాంగ్ మార్చ్ ఆహ్వానంపై బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. తొలుత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ వేదికను తాము పంచుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైతం పవన్ తో వేదికను పంచుకోబోమని తెలిపారు. 

అయితే శుక్రవారం కన్నా లక్ష్మీనారాయణ మాట మార్చారు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు బీజేపీ సంఘీభావం తెలుపుతుందని తెలిపారు. అయితే విష్ణువర్థన్ రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. దాంతో బీజేపీ గందరగోళంలో పడింది. 

ఇకపోతే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ మాత్రమే బహిరంగంగా మద్దతు తెలిపింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు మద్దతు పలికారు. పార్టీ తరపున సీనియర్ నేతలు పాల్గొంటారని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్ లో ఏఎలాంటి పిలుపు ఇచ్చినా తాము మద్దతు ఇస్తామంటూ చంద్రబాబు స్నేహ హస్తం అందించారు. 

click me!