
భారత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. బుధవారం లోక్సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూసుకెళ్లగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలాడు. లోక్సభలోకి దూకిన వ్యక్తి .. ఎంపీలు కూర్చొనే టేబుళ్లపైకి ఎక్కి నల్ల చల్లాలను బంద్ చేయాలంటూ నినాదాలు చేశాడు. చర్చా కార్యాక్రమంలో వున్న వేళ పొగ రావడంతో లోపల ఏం జరుగుతుందో అర్ధం కాక ఎంపీలు పరుగులు తీశారు. అయితే కొందరు పార్లమెంట్ సభ్యులు మాత్రం ధైర్యంగా దుండగుడిని పట్టుకున్నారు. వీరిలో మన తెలుగు ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కూడా వున్నారు.
విజిటర్స్ గ్యాలరీ నుంచి దుండుగు దూకిన వెంటనే అతనిని పట్టుకునేందుకు కొందరు ఎంపీలు యత్నించారు. ఆ సమయంలో గోరంట్ల మాధవ్ కూడా అక్కడే వున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సభలో కుర్చీల మీదికి ఎక్కి నిందితుడు వున్న వైపు చేరుకున్న మాధవ్ అతనిని చితకబాదారు. అతని చేతులు వెనక్కి విరిచి కట్టి, భద్రతా సిబ్బందికి అప్పగించారు. అనంతరం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. కిందకి దూకిన వెంటనే అగంతకులు స్మోక్ బాంబును విసిరారని, దీని వల్ల ఎదురుగా ఏం వుందో కనిపించనంతగా పొగ కమ్ముకుందన్నారు.
నిందితుడు బెల్ట్ బాంబును నడుముకు కట్టుకుని వుంటాడనే అనుమానంతో అతనిని తనిఖీ చేశానని గోరంట్ల మాధవ్ వెల్లడించారు. నిందితుల పథకాన్ని, కుట్రను భగ్నం చేసేలా ఎంపీలు ధైర్యంగా ఎదుర్కొన్నారని మాధవ్ ప్రశంసించారు. గతంలో తాను సీఐగా పనిచేసిన అనుభవం ఇక్కడ ఉపయోగపడిందని ఆయన వెల్లడించారు. తమ ధన, మాన, ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఒక పోలీస్ అధికారిగా పనిచేయాల్సిన అవసరం వుందని గోరంట్ల మాధవ్ చెప్పారు. ఈ ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని పార్లమెంట్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.