
సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా తేడా సింగే అనిపించుకుంటున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు నందమూరి బాలకృష్ణే. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న పైసా వసూల్ సినిమాలో బాలకృష్ణకు ఓ డైలాగుంది. ‘ నా పేరు తేడా సింగ్’ అంటూ ఓ బారులో భారీ డైలాగ్ చెబుతారు బాలయ్య. ఆ డైలాగ్ ఆధారంగా రాజకీయాల్లో కూడా బాలయ్యపై సెటైర్లు మొదలయ్యాయి.
పైసా వసూల్ సినిమాలో సంగతేమో కానీ నిజజీవితంలో మాత్రం టిడిపి హిందుపురం ఎంఎల్ఏ బాలకృష్ణ నిజంగా తేడా సింగే అంటున్నారు. ఎలాగంటే, నియోజకవర్గంలో గెలిచిన దగ్గర నుండి మామూలు జనాలను పట్టించుకోవటం మానేసారు. పైగా నియోజకవర్గాన్ని పిఏ చేతికి అప్పగించేసి దాదాపు రెండేళ్ళపాటు చోద్య చూసారు. పిఏ ఆగడాలు భరించలేక పార్టీ నేతలు, సామాన్య జనాలు చివరకు బాలయ్యపై తిరుగుబాటు లేవదీసిన సంగతి అందరూ చూసిందే.
ప్రధానమైన మంచినీటి సమస్యను కూడా బాలయ్య పట్టించుకోకపోవటంతో చివరకు హిందుపునం మునిసిపాలిటీలోని మహిళలు పెద్దఎత్తున ఆందోళన చేసిన సంగతి అందరూ చూసారు. అంతేకాకుండా బర్రెలపై బాలకృష్ణ ఎంఎల్ఏ అని రాసి ఊరేగించిన విషయమూ చూసారు. దాంతో బాలయ్యకు దిమ్మతిరిగింది. అప్పటికప్పుడు అధికారులతో సమస్య పరిష్కారం కోసం మాట్లాడారు. అదే విధంగా పిఏపైన కోపంతో నేతలందరూ బాలయ్యపైనే తిరుగుబాటు లేవదీసేసరికి వేరే దారిలోక చివరకు పిఏని వదిలించుకున్నారు.
అదేవిధంగా, నంద్యాల ఉపఎన్నికలో ప్రచారం చేయవయ్యా అని పిలిచారు. రోడ్డుషోల్లో ఏమి మాట్లాడారో కుడా అర్ధం కాకుండా మాట్లాడారు. అదే సమయంలో ఓటర్లకు వ్యాన్లో నుండే డబ్బులు పంచుతూ కెమెరాలకు దొరికారు. ఇపుడీ విషయం కోర్టుకెక్కింది. మధ్యలో వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడంతో బాలయ్య అప్పుడప్పుడు వార్తల్లో కనబడుతూనే ఉన్నారు. ఇదంతా చూస్తున్న వారికి పైసావసూల్ సినిమాలో బాలయ్య డైలాగ్ సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారు.