operation royal vasista: బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం టీమ్

By sivanagaprasad KodatiFirst Published Oct 22, 2019, 2:36 PM IST
Highlights

రోజుల తరబడి నిరీక్షణకు తెరదించుతూ..తమ వారి కడసారి చూపు దక్కుతుందో లేదోనన్న బాధను తీరిస్తూ ధర్మాడి సత్యం టీమ్ రాయల్ వశిష్ట బోటును బయటకు తీసింది. 

రోజుల తరబడి నిరీక్షణకు తెరదించుతూ..తమ వారి కడసారి చూపు దక్కుతుందో లేదోనన్న బాధను తీరిస్తూ ధర్మాడి సత్యం టీమ్ రాయల్ వశిష్ట బోటును బయటకు తీసింది. మంగళవారం ఇప్పటి వరకు మూడు సార్లు నదిలోకి వెళ్లిన డైవర్లు బోటును పరిశీలించారు.

ఎక్కడ రోప్ బిగించాలన్న అంశంపై చర్చించారు. మరోవైపు భారీ వర్షం కారణంగా గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడవచ్చని అధికారులు భావించారు. అయినప్పటికీ ధర్మాడి సత్యం టీమ్ జోరు వానలో తీవ్రంగా శ్రమించి బోటును ఒడ్డుకు చేర్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో బోటును వెలికితీశారు. 

సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద పర్యాటకులతో వెళ్తున్న రాయల్ వశిష్ట బోటు గోదావరిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 73 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇంకా దాదాపు 14 మంది ఆచూకీ దొరకలేదు.

Also Read: ఆపరేషన్ రాయల్ వశిష్టలో పురోగతి: బోటు పైభాగం వెలికితీత

ఏసీ క్యాబిన్‌లో పలువురు ప్రయాణికులు చిక్కుకుని ఉంటారని భావించారు. మునిగిపోయిన బోటు వెలికితీత కోసం అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ధర్మాడి సత్యం బృందానికి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. 

బోటును వెలికితీసే పనిని మంగళవారం నాడు ఉదయం ధర్మాడి సత్యం బృందం ప్రారంభించింది. సోమవారం నాడు రాయల్ వశిష్ట బోటు వెలికితీసే ప్రక్రియలో బోటు పై భాగం ముక్కలు బయటకు వచ్చాయి.

గోదావరి నదిలో ఇసుక పేరుకుపోవడంతో కూడ బోటు వెలికితీతకు కొంత ఇబ్బందులు చోటు చేసుకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.సోమవారం ఉదయం ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. రెండు రోప్‌ల మునిగిపోయిన బోటుకు కట్టి వెలుపలికి తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో బోటు పైకప్పు భాగాలు బయటకు వచ్చాయి.

రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు వెలికితీత పనులను కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్‌ వాటర్‌ సర్వీసెస్‌కు చెందిన పది మంది డైవర్లలో నాగరాజు, స్వామి అనే ఇద్దరు ఆదివారం ఉదయం 11 గంటలకు బోటు మునిగిన ప్రదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు.

దాదాపు 15 నిమిషాలపాటు ఆ ప్రాంతంలో బోటు ఎలా ఉంది? దాని చుట్టూ ఇసుక, మట్టి ఎంతమేర పేరుకుపోయాయి? బోటుకు ఎక్కడ తాడు బిగిస్తే పైకి రావడానికి అనువుగా ఉంటుందనే కోణంలో పరిశీలించి వచ్చి పోర్టు అధికారికి వివరించారు.  

Also Read: బోటు వెలికితీత: నదీగర్భంలోకి దూసుకెళ్లిన గజఈతగాళ్లు.. పాప మృతదేహం లభ్యం

ఇలా 6 సార్లు డైవర్లు బోటు మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరిలో బోటు ఏటవాలుగా మునిగి ఉందని పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ విలేకర్లకు తెలిపారు. నదిలో బోటు ముందు భాగం 40 అడుగుల లోతులో ఉంటే, వెనుక భాగం దాదాపు 70 అడుగుల లోతులో ఉందని చెప్పారు. 

మంగళవారం నాడు ఉదయం నుండే బోటును వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బోటుకు ఇనుప రోప్ వేసి ప్రొక్లెయినర్ సహాయంతో బయటకు లాగనున్నారు. సోమవారం నాడు బోటు కొన్ని అడుగుల దూరం జరిగింది. ప్రొక్లెయినర్ తో లాగే క్రమంలో బోటు పైకప్పు విడిభాగాలు మాత్రమే బయటకు వచ్చాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన పాపికొండల పర్యటనకు వెళ్తున్నబోటు మునిగిపోయింది. ఈ బోటు ప్రమాదంలో సుమారు 15 మంది ఆచూకీ గల్లంతైంది. రెండు రోజుల క్రితం ఒక మృతదేహాన్ని గజ ఈతగాళ్లు గుర్తించారు.

Also Read:200 మీటర్ల దూరం...50 అడుగుల లోతు...: కచ్చులూరు బోటు ఆచూకీపై క్లారిటీ

ఈ మృతదేహానికి తల లేదు. ఈ మృతదేహం ఎవరిదనే విషయాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. ఆచూకీ గల్లంతైన వారంతా బోటులోనే చిక్కుకొని ఉంటారని విశ్వసిస్తున్నారు. గల్లంతైన వారంతా మృతి చెందారని భావించి ఆయా కుటుంబసబ్యులకు డెత్ సర్టిఫికెట్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

click me!