మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడికి గాయం తిరగబెట్టిందని గుంటూరు డాక్టర్లు తెలిపారు.
గుంటూరు: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడికి గాయం తిరగబెట్టిందని... రక్తస్రావం కంట్రోల్ కావడం లేదని గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు.
ఇన్ఫెక్షన్ కారణంగా రక్తస్రావం ఆగడం లేదని... కాబట్టి మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు తెలిపినట్లు సమాచారం.
ఈఎస్ఐ అవకతవకలతో సంబంధముందన్న అభియోగాలతో మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడును ఇటీవలే ఏసిబి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపుెలో వున్న అతడికి వైద్య పరీక్షలు చేయించేందుకు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో డాక్టర్లు అతడికి మరోసారి శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. ఉన్నతాధికారుల అనుమతితో ఇవాళ మరోసారి ఆయనకు ఆపరేషన్ చేయించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవలే అచ్చెన్నాయుడికి ఆపరేషన్ జరిగింది. దీంతో ఆయనకు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో బుధవారం మరోసారి వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించగా వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మరోసారి ఆపరేషన్ అవసరమని తేల్చారు.
read more ఆస్పత్రిలో అచ్చెన్నాయుడు.. పరామర్శకు అనుమతి కోరిన లోకేష్
ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన అచ్చెన్నాయుడికి ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజులు రిమాండ్ విధించారు. అనారోగ్యం కారణంగా ఆయనను వైద్యసదుపాయం అందుబాటులో వుండేలా చూడాలని కోర్టు ఆదేశించింది. దాంతో ఆయనను తొలుత విజయవాడ సబ్ జైలుకు తరలించి ఆ తర్వాత గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
ఈ స్కాంలో ప్రధాన నిందితుడైన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను కూడా అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఆయనకు కూడా రెండు వారాల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు.