ఏపీ చేపలు మంచివే.. క్యాన్సర్ రాదు

First Published Jul 18, 2018, 10:32 AM IST
Highlights

ఆంద్రప్రదేశ్‌ చేపల్లో ఫార్మాలిన్‌ అవశేషాలు లేవని అధికారుల బృందం తేల్చింది. రాష్ట్రం నుంచి మత్స్యశాఖ అదనపు సంచాలకులు కోటేశ్వరరావు తదితర అధికారుల బృందం అక్కడకు వెళ్లి పరీక్షలు నిర్వహించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఏపీ నుంచి అసోంకి దిగుమతయ్యే చేపలు తింటే క్యాన్సర్ వస్తుందంటూ.. పదిరోజుల క్రితం ఈ చేపలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా.. అదంతా నిజం కాదని అధికారులు పేర్కొన్నారు. అసోంకు వెళ్తున్న ఆంద్రప్రదేశ్‌ చేపల్లో ఫార్మాలిన్‌ అవశేషాలు లేవని అధికారుల బృందం తేల్చింది. రాష్ట్రం నుంచి మత్స్యశాఖ అదనపు సంచాలకులు కోటేశ్వరరావు తదితర అధికారుల బృందం అక్కడకు వెళ్లి పరీక్షలు నిర్వహించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

రాష్ట్ర బృందం... సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ(సిప్ట్‌) తయారు చేసిన ప్రత్యేక కిట్లను తీసుకెళ్లి చేపలను పరీక్షించింది. అసోం మత్స్యశాఖ డైరెక్టర్‌ దాస్‌, కార్యదర్శి రాకేశ్‌కుమార్‌ను కలిసి రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించింది. అక్కడి అధికారుల సమక్షంలోనే మొత్తం 9 నమూనాలను పరీక్షించారు. 8 నమూనాల్లో ఎలాంటి అవశేషాలు లేవని తేలింది. 

మరో దానిలో మాత్రం నిర్ణీత వ్యవధి కంటే ఆలస్యంగా కాస్త రంగులో తేడా వచ్చింది. ఆలస్యంగా రంగు మారడం వల్ల దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అసోం అధికారుల అనుమానాలను నివృత్తి చేశాక దిగుమతులకు అనుమతించాలని అధికారులు కోరారు. అయితే నియంత్రణ అంశం అసోం కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో ఉండటంతో నిర్ణయం.. వారు తీసుకోవాల్సి ఉంది. పదిరోజులు నిషేధం ముగిసిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలకు ప్రతిరోజు 250 టన్నుల వరకు చేపలు వెళ్తున్నాయి. దారిలో కంటెయినర్లను నిలిపేసి ఫార్మాలిన్‌ కలుపుతున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే తాజా పరీక్షలతో అదేమీ లేదని నిర్ధరణ అయిందని మత్స్యశాఖ అదనపు డైరెక్టర్‌ కోటేశ్వరరావు వివరించారు.

click me!