
విజయనగరం:ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు గ్రామాల్లో మంగళవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొటియా గ్రామాలైన పట్టుచెన్నూరు, పగులు చెన్నూరుల్లో జగనన్న పచ్చతోరణం,విద్యా దీవెన కార్యక్రమాలను ప్రారంభించేందుకు సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్ నిర్ణయం తీసుకొన్నారు.
అయితే ఈ విషయం ఒడిశా అధికారులకు తెలిసింది. ఒడిశా అధికారులు, పలు పార్టీల నేతలు ఏపీ సరిహద్దుకు చేరుకొన్నారు.ఒడిశాలోని పొట్టంగి, కొరాపుట్, జయపురం ఎమ్మెల్యేలు, బీజేపీ మాజీ ఎంపీ జయరాం పంగి, బీజేడీ, కాంగ్రెస్ నేతలు సరిహద్దులోని హర్మాడగి చెక్ పోస్టు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
విద్యాకానుక పథకం కింద పంపిణీ చేసేందుకు తీసుకొచ్చిన పుస్తకాలను ఉపాధ్యాయుల నుండి ఒడిశా పార్టీల నేతలు లాక్కొన్నారు.కొటియా గ్రామాలకు వెళ్లకుండా అన్నిమార్గాల్లో ఒడిశా అధికారులు చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతో అక్కడికి వెళ్లలేకపోయామని సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర చెప్పారు.అంతేకాదు కలెక్టర్, ఎస్పీలు కూడ ఆ గ్రామాలకు వెళ్లొద్దని తమకు సూచించారని ఆయన చెప్పారు.