
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీల రాజీనామాలతో ఏర్పడ్డ స్థానాల్లో ఉపఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా ప్రకటన చేస్తోందని అంతా ఊహించారు. ఉపఎన్నికలు ఉండే అవకాశం ఉందని వార్తలు కూడా ప్రచారం జరిగాయి.
ఈ నేపథ్యంలో ఐదురాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ తోపాటు ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలతో ఏర్పడ్డ స్థానాల్లో ఉపఎన్నికలు ఉంటాయని భావించారు. అయితే ఎంపీల రాజీనామాలపై కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ స్పష్టత ఇచ్చారు. ఉపఎన్నికలు జరిగే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు లోక్సభ సభ్యులు ఏప్రిల్ 6న రాజీనామా చేశారు. మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్రెడ్డి, వై.ఎస్.అవినాష్రెడ్డి తమ రాజీనామా లేఖలను సభాపతి సుమిత్రా మహాజన్కు అందచేశారు. రాజీనామా అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆమరణ దీక్షసైతం చేశారు.
రాజీనామా చేసిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో స్పీకర్ స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశమయ్యారు. రాజీనామాలపై పునరాలోచించాలని స్పష్టం చేశారు. వారం రోజుల్లో గడువు ఇచ్చారు. వారం రోజుల అనంతరం స్పీకర్ ను కలిసిన ఎంపీలు తమ రాజీనామా ధృవీకరణ పత్రాలను స్పీకర్ కు సమర్పించారు.
తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. అదే నెలలో సుమిత్రా మహాజన్ 10 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లడం...జూన్ నెలలో తిరిగి రావడం జరిగింది. అనంతరం ఆమె ఎంపీల రాజీనామాలను ఆమోదించినట్లు ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ ఎంపీల రాజీనామాలను ఈ ఏడాది జూన్ 4న కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. అయితే ఎన్నికలు ఒక సంవత్సరం లోపు ఉండగా రాజీనామా చేస్తే ఆయా స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ తెలిపారు.
ఎంపీల కాలపరిమితి 2019 జూన్ 3 తో ముగియనుంది. అంటే సంవత్సరానికి ఒక్కరోజు ముందే ఎంపీలు రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ప్రకారం ఉపఎన్నికలు జరిగే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు.