ఏపీ డిప్యూటీ సీఎంకు మరో ఝలక్: జనసేన అభ్యర్థిగా పోటీకి సై అంటున్న అన్నయ్య

By Nagaraju penumalaFirst Published Feb 23, 2019, 8:09 AM IST
Highlights

ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పకు ఝలక్ ఇచ్చారు ఆయన సోదరుడు నిమ్మకాయల లక్ష్మణ మూర్తి. ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. సోదరుడి షాక్ నుంచి కోలుకోలేకపోతున్న చినరాజప్పకు మరో దెబ్బకొట్టారు. 

విజయవాడ:

విజయవాడ: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీపడ్డాయి. 

ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పకు ఝలక్ ఇచ్చారు ఆయన సోదరుడు నిమ్మకాయల లక్ష్మణ మూర్తి. ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. సోదరుడి షాక్ నుంచి కోలుకోలేకపోతున్న చినరాజప్పకు మరో దెబ్బకొట్టారు. 

పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం సీటు కోరుతూ జనసేన పార్టీ కార్యాలయంలో బయోడేటా సమర్పించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. శుక్రవారం నిమ్మకాయల లక్ష్మణమూర్తి పెద్దాపురం నుంచి జనసేన అభ్యర్ధిత్వం కోరారు. 

అందుకు సంబంధించి లక్ష్మణమూర్తి జనసేన స్క్రీనింగ్ కమిటీకి తన బయోడాటాను అందజేశారు. పార్టీ నిర్దేశించిన నమూనాలను పూర్తి చేసి విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో కమిటీ సభ్యులకు అందజేశారు. తన సోదరుడు చినరాజప్ప పోటీ చేసి గెలిచిన పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానంటూ లక్ష్మణమూర్తి చెప్పడం కలకలం రేపుతోంది.  

ఇకపోతే ఏపీ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాబోయే ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అప్పుడే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు కూడా. 

టీడీపీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేర్గాంచిన చినరాజప్ప సోదరుడు లక్ష్మణమూర్తి ఇచ్చిన ఝలక్ ఇబ్బందికరంగా మారిందని ప్రచారం జరుగుతోంది. ఇంటిపోరుతో సతమతమవుతున్న చినరాజప్ప ఆ సమస్య నుంచి ఎలా బయటపడతారో అన్నది వేచి చూడాలి.  
 

ఈ వార్తలు కూడా చదవండి

డిప్యూటీ సీఎంకి ఝలక్: జనసేనలో చేరిన సోదరుడు

click me!