
కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై నెల్లూరు జిల్లా ఎస్పీ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
చంద్రబాబు కాన్వాయ్ ముందుకు, వెనక్కి వెళ్లడమే కారణమన్నారు. చంద్రబాబు సభకు 3 నుంచి 7 గంటల మధ్యే అనుమతి ఇచ్చామని ఎస్పీ పేర్కొన్నారు. అనుమతి లేకపోయినా టపాసులు కాల్చారని... చంద్రబాబు వాహనం ఎప్పుడైతే కదిలిందో , అప్పుడే తొక్కిసలాట జరిగిందని ఆయన వెల్లడించారు.
అంతకుముందు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. చంద్రబాబులో కనీసం పశ్చాత్తపం కూడా లేదని సజ్జల దుయ్యబట్టారు. సభ జరపాల్సిన చోట కాకుండా ఉద్దేశపూర్వకంగానే ఇరుకు రోడ్డుపై పెట్టారని సజ్జల ఆరోపించారు. ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలో వున్నప్పుడు పుష్కరాల్లో భక్తుల్ని బలి తీసుకున్నారని.. ఇప్పుడు జనం ఎక్కువగా వచ్చారని పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నించారని సజ్జల ఆరోపించారు.
చంద్రబాబులో లెక్కలేనితనం, అహంకారం కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బాబుది శవాలపై పేలాలు ఏరుకునే వైకరంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అనుమతుల్ని చంద్రబాబు పట్టించుకోలేదని.. అనుమతి తీసుకున్న ప్రాంతం కంటే ముందుకెళ్లి సభ పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ఏది జరిగినా సెన్సేషన్ చేసుకోవాలన్నదే చంద్రబాబు ఆరాటమని... చంద్రబాబుకు జనం ప్రాణాలంటే లెక్కలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారవంతమైన ఆలోచనలున్న వ్యక్తిగా కూడా చంద్రబాబు లేరంటూ సజ్జల దుయ్యబట్టారు. ఒక దుర్ఘటనను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు వికృత విన్యాసంలో నరబలి జరిగిందని భావిస్తున్నామని.. డ్రోన్ షాట్ల కోసమే జనాల్ని ఇరుకు రోడ్డులోకి తరలించారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.