నారాయణ...నారాయణ

First Published Mar 28, 2017, 7:17 AM IST
Highlights

లక్షలాది విద్యార్ధుల భవిష్యత్తుతో ముడిపడిన ఇంత కీలకమైన అంశంపై అసెంబ్లీ చర్చించటానికి మాత్రం ప్రభుత్వం అంగీకరించకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

పదవ తరగతి పరీక్ష ప్రశ్నాల లీకేజి వ్యవహారంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఒకరేమో ప్రశ్నలు లీకైందంటారు. మరొకరేమో లీకేజీనే లేదంటారు. ఒకరేమో విచారణ జరిపిస్తామని చెబుతారు. ఇంకోరేమో అసలు లీకేజీనే లేనపుడు విచారణ అవసరం ఏమటని ఎదరుప్రశ్నిస్తారు. విద్యాశాఖ డైరెక్టరేమో లీకేజిని నిర్ధారిస్తే, మంత్రులె నారాయణ, పల్లె రఘునాధరెడ్డిలు ఎక్కడా లీకేజి లేదని ఎదరుదాడి చేస్తున్నారు. మొత్తం మీద లీకేజి వ్యవహారం గందరగోళంగా తయారైంది. ఈ నేపధ్యంలో మంత్రి నారాయణ,  విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సభలోకే అడుగుపెట్టటం లేదు.

జరుగుతున్నది చూస్తుంటే ప్రభుత్వమే కావాలనే నాటకాలాడిస్తున్నట్లు అనుమానాలు మొదలయ్యాయి. ప్రశ్నాపత్రాల లీకేజి వాస్తవమేనని స్పష్టంగా తెలుస్తున్నా ప్రభుత్వం మాత్రం గుడ్డిగా సమర్ధించుకుంటోంది. ప్రశ్నాపత్రం ఎక్కడా లీక్ కాలేదని మున్సిపల్ శాఖ మంత్రి, నారాయణ విద్యాసంస్ధల అధిపతి పి. నారాయణ ఎదురుదాడి చేస్తుండటం గమనార్హం. ఇక, నారాయణ వియ్యంకుడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ అయితే అసలు పత్తానే లేరు. ఇప్పటి వరకూ జరిగిన పరీక్షల్లో ఫిజిక్స్, తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు లీకయ్యాయన్నది అభియోగం. దానికితోడు ప్రశ్నపత్రానికి సమాధానాలు రాస్తూ నారాయణ విద్యాసంస్ధల ఉద్యోగి ఒకరు దొరకటంతో గందరగోళం మరింత పెరిగిపోయింది.

అయినా ప్రశ్నపత్రం లీక్ కాలేదని ప్రభుత్వం సమర్ధించుకోవటం ఆశ్చర్యంగా ఉంది. లీకైన పేపర్లన్నీ నెల్లూరు, కదిరి, మడకశిర నుండి బయటకు వచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని అసెంబ్లీలో వైసీపీ లేవనెత్తితింది. అయితే, ఆ విషయాన్ని అధికార పార్టీ కొట్టిపారేసింది. ప్రశ్నాపత్రాల లీకేజి విషయంపై చర్చ జరపాల్సిన అవసరం లేదన్నది టిడిపి వాదన. లీకేజీనే లేనపుడు ఇక విచారణకు అవసరమేమిటని అధికారపార్టీ ఎదురుదాడి చేస్తున్నది. సభలో ఇంత గందరగోళం జరిగిన తర్వాత గంటా మాట్లాడుతూ, ప్రశ్నాపత్రం  బయటకు రాలేదని, ఒకవేళ నిజంగానే లీకైతే తప్పేనని అంగీకరించారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా ఎవరినీ వదిలేదని మొక్కుబడి సమాధానం ఒకటి పారేసారు.

లక్షలాది విద్యార్ధుల భవిష్యత్తుతో ముడిపడిన ఇంత కీలకమైన అంశంపై అసెంబ్లీ చర్చించటానికి మాత్రం ప్రభుత్వం అంగీకరించకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు ప్రభుత్వమే ప్రశ్నపత్రాల లీకేజీ అసలు లేనే లేదని చెబుతుంటే విచారణలో మాత్రం లీకైందని అధికారులు నివేదిక ఇస్తారా అన్నది అనుమానం. ఇదిలావుండగా, లీకేజి వ్యవహారంపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారని ప్రచారం మొదలైంది. పక్కాగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారని తెలుస్తోంది.

click me!