జగన్ నెత్తుటి దాహానికి... మరో ఇద్దరు టిడిపి నాయకులు బలి: కర్నూల్ హత్యలపై లోకేష్

Published : Jun 17, 2021, 11:38 AM ISTUpdated : Jun 17, 2021, 11:44 AM IST
జగన్ నెత్తుటి దాహానికి... మరో ఇద్దరు టిడిపి నాయకులు బలి: కర్నూల్ హత్యలపై లోకేష్

సారాంశం

ఫ్యాక్ష‌న్ రెడ్డి గ్యాంగులు వేట‌కొడ‌వ‌ళ్లు, క‌త్తులు, గొడ్డ‌ళ్ల‌కు ప‌దునుపెట్టి ప‌ల్లెల్లో ప్ర‌తీకారాల‌కు దిగుతున్నాయని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. 

గుంటూరు; జ‌గ‌న్‌రెడ్డి చీఫ్ మినిస్ట‌ర్ ముసుగు తీసేసి ఫ్యాక్ష‌నిస్ట్‌ నిజ‌రూపాన్ని బ‌య‌ట‌పెడుతున్నాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఫ్యాక్ష‌న్ రెడ్డి గ్యాంగులు వేట‌కొడ‌వ‌ళ్లు, క‌త్తులు, గొడ్డ‌ళ్ల‌కు ప‌దునుపెట్టి ప‌ల్లెల్లో ప్ర‌తీకారాల‌కు దిగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి శ్రేణులే ల‌క్ష్యంగా వైసీపీ ఫ్యాక్ష‌న్ ముఠాలు చెల‌రేగిపోతున్నాయని లోకేష్ మండిపడ్డారు. 

''కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసరవాయిలో టిడిపి నాయకులు వడ్డి నాగేశ్వర రెడ్డి, వడ్డి ప్రతాప్ రెడ్డిల‌ను కారుతో ఢీకొట్టిన‌ వైసీపీ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్లు వేట‌కొడ‌వ‌ళ్ల‌తో న‌రికి చంపేయ‌డం అత్యంత దారుణం. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రో ముగ్గురు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను. మృతులు, వైసీపీ బాధిత కుటుంబాల‌కు టిడిపి అండ‌గా వుంటుంది'' అని వెల్లడించారు.

''రాష్ట్రంలో జ‌గ‌న్‌రెడ్డి, ఆయ‌న పార్టీ నేత‌ల‌ నెత్తుటి దాహానికి ఈ దారుణ‌ మ‌ర‌ణాలు సాక్ష్యం. ఫ్యాక్ష‌న్ ముఠాలు ఆ ఫ్యాక్ష‌న్‌కే పోతాయి. గ్రామాల‌లో శాంతి నెల‌కొల్ప‌డానికి, స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి తెలుగుదేశం ఎప్పుడూ సిద్ధమే'' అని లోకేష్ పేర్కొన్నారు. 

 

కర్నూల్ జిల్లాలో పాతకక్షలతో ఇద్దరు టిడిపి నాయకులను ప్రత్యర్ధులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ దుర్ఘటన గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో చోటు చేసుకొంది. ఈ హత్యలతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మృతుల  చిన్నాన్న ఇటీవలనే మరణించగా మూడో రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ప్రత్యర్ధులు కాపుకాసి వేటకొడవళ్లతో నరికి చంపారు.  

మొదట వీరిద్దరిని ప్రత్యర్ధులు బొలెరో వాహనంలో ఢీకొట్టారు. ప్రత్యర్ధులు దాడి చేస్తున్నారని గమనించి బాధితులు పారిపోతుండగా నిందితులు వారిని వేటాడి వేటకొడవళ్లతో నరికి చంపారు. దీంతో సంఘటన స్థలంలో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్రంగా గాయలైనట్టుగా స్థానికులు చెబుతున్నారు.  గాయపడిన వారిని  నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu