ఆశలపై నీళ్ళు చల్లేసిన బ్రాహ్మణి

First Published Feb 11, 2017, 10:05 AM IST
Highlights

తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

నందమూరి అభిమానుల ఆశలపై నారా బ్రాహ్మణి ఒక్కసారిగా నీళ్ళు చల్లేసింది. పేరుకు నారా బ్రాహ్మణే అయినా అందరిలోనూ ఎన్టీఆర్ మనవరాలుగా, బాలకృష్ణ కూతురిగానే బ్రాహ్మణి క్రేజ్ సంపాదించుకుంది. దానికి తగ్గట్లే, బాగా చదువుకున్నది, మంచి వాగ్ధాటి కూడా ఉండటంతో బ్రాహ్మణి కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని నందమూరి, టిడిపి అభిమానులు ఎప్పటి నుండో అనుకుంటున్నారు. అటువంటిది ఒక్కసారిగా బ్రాహ్మణి నీళ్లు చల్లేసారు. జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ వచ్చారు. అనంతరం ఓ ఛానల్ తో మాట్లాడుతూ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

 

వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణి స్టార్ క్యాంపైనర్ గా ఉంటారని పార్టీలో ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ లో ప్రియాంకా గాంధి, టిఆర్ఎస్ లో కవితలు రాజకీయాల్లో బాగా దూసుకుపోతున్నారు. ఇంకోవైపు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కూడా తన పాదయాత్రల ద్వారా యువతను ఆకట్టుకున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయాల్లోకి వస్తారని పార్టీలో పలువురు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో బ్రాహ్మణి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పటం గమనార్హం. ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ అన్న నానుడిని నిజం చేస్తుందా లేక నిజంగానే మాటపైనే నిలబడుతుందా చూడాలి.

click me!