పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేస్తూ, పోలవరం నిర్మాణాన్ని వద్దని కేంద్రం వద్దంటే వాళ్లకే ఇచ్చేసి ఓ దణ్ణం పెట్టేస్తా అంటూ చెప్పారు. ఏ విషయంలో కూడా కేంద్రం పూర్తిగా సహకరించటం లేదని కేవలం మిత్రపక్షం కాబట్టే అన్నింటినీ సహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం సహకరించకపోతే.. అంటూ తమ కష్టమే మిగిలుతుందంటూ చివరి నిముషంలో మాట మార్చారు.
పోలవరం విషయంలో మొదటి నుండి కేంద్రం ఇబ్బందులు పెడుతూనే ఉందని తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అందుకే ఈరోజు భాజపా మంత్రులు, ఎంఎల్ఏలను కేంద్రానికి వెళ్ళి మాట్లాడమని చెప్పినట్లు చంద్రబాబు చెప్పారు. 6 నెలల పాటు పోలవరం పనులు గనుక నిలిచిపోతే తిరిగి గాడిన పెట్టటం చాలా కష్టమన్నారు. విభజన హామీల విషయంలో రాజకీయాలు చేసేదేమీ లేదన్నారు. అన్నీ విధాల నష్టపోయిన రాష్ట్రం కాబట్టే హామీల అమలుకు కృషి చేస్తూనే ఉంటాను అని తెలిపారు.
చంద్రబాబు మాటలను బట్టి కేంద్రంపై ఏ స్ధాయిలో మండిపోతున్నారో అర్ధమవుతోంది. వేరే దారి లేకే భాజపా తో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విషయం స్పష్టమైపోయింది. విభజన హామీలు, పోలవరం లాంటి అన్ని అంశాలపైనా కేంద్రం పెద్దగా సహకరించటం లేదంటూ మండిపడ్డారు. తాను ఆశావాదనని, తన పని తాను చేసుకుంటూనే పోతానంటూ చెప్పారు.