మొత్తానికి చంద్రబాబునాయుడు చట్టసభల్లో పదవులను భర్తీ చేసేసారు. అసెంబ్లీ, మండలిలో చీఫ్ విప్పులు, విప్పుల పదవులను భర్తీ చేసారు. శాసనమండలి చైర్మన్ గా ఎండీ ఫరూక్ నియమితులయ్యారు. అదే సమయంలో మండలి చీఫ్ విప్ గా పయ్యావుల కేశవ్ ను చంద్రబాబునాయుడు నియమించారు. అసెంబ్లీ చీఫ్ విప్ గా పల్లె రఘునాథరెడ్డిని అపాయింట్ చేసిన చంద్రబాబు మరో ఆరుగురికి విప్ పదవులు కట్టబెట్టారు. అలాగే, శాసనమండలి విప్ లుగా బుద్దా వెంకన్న, ఎంఏ షరీఫ్, రామసుబ్బారెడ్డి, డొక్కా మాణిక్య వర ప్రసాద్ లను నియమించారు. అసెంబ్లీ విప్ పదవులు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు లకు దక్కింది. వీరిలో సర్వేశ్వరరావు ఫిరాయింపు ఎంఎల్ఏ కావటం గమనార్హం. తాజా జాబితా గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళింది. గవర్నర్ ఆమోదించిన తక్షణమే, పదవులు స్వీకరిస్తారు.