సర్వమత సమానత్వం రాజ్యాంగం కల్పించిన హక్కు అని అదే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏలూరు కాంతి కళ్యాణ మండపంలో పాస్టర్ల అసోషియేషన్ తో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఒకే మతానికి ఒకే రూల్ అమలు చేస్తే అన్ని మతాలకీ అదే రూల్ అమలవ్వాన్నారు.
ఏలూరు: సర్వమత సమానత్వం రాజ్యాంగం కల్పించిన హక్కు అని అదే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏలూరు కాంతి కళ్యాణ మండపంలో పాస్టర్ల అసోషియేషన్ తో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఒకే మతానికి ఒకే రూల్ అమలు చేస్తే అన్ని మతాలకీ అదే రూల్ అమలవ్వాన్నారు. సమాజంలో క్రైస్తవులు పడుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు పాస్టర్లు.
ఒక్కో మతానికి ఒక్కో నిబంధన అమలు చెయ్యడం సరికాదని...రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో జనసేన పార్టీ క్రైస్తవులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఓట్ల కోసం తాను మద్దతు తెలపడం లేదని మనస్ఫూర్తిగా దేశ సమగ్రతని, మతాల మధ్య సామరస్యాన్ని కాపాడుతానని హామీ ఇచ్చారు. తాను సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదువుకున్నానని పవన్ గుర్తు చేశారు.
క్రిస్టియానిటీ అంటే అందరి దృష్టిలో ఒక మతమే కావొచ్చు అని తనకు మాత్రం బాధ్యత అని తెలిపారు. తనకు దేశభక్తి నేర్పింది కూడా క్రిస్టియన్ స్కూలేనని తెలిపారు. ఓ బాధ్యతతో ఇంతదూరం తన ప్రయాణం సాగిందంటే అందుకు కారణం ఆ పాఠశాలలో నేర్చుకున్న విషయాలేనన్నారు.
చిన్ననాటి నుంచి సర్వమతాల సారాన్ని అర్థం చేసుకుంటూ వస్తున్నానని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన క్రైస్తవం ఇంతమంది మనసును గెలుచుకుందంటే అందుకు కారణం ఆ మతంలో ఉన్న సేవా దృక్పథమేనని కొనియాడారు. క్రైస్తవుల సేవకి ఎలాంటి అడ్డంకులు ఇబ్బందులు ఉన్నా జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు.
అన్ని మతాలను అర్థం చేసుకోవడానికి నా ఇద్దరు పిల్లలని క్రిస్టియన్లుగా దేవుడు పుట్టించాడన్నారు. తన ఇద్దరు బిడ్డలు ఆర్ధోడాక్స్ క్రిస్టియన్లని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఒక మతం ఒక పార్టీకి అంకితమవ్వదన్నారు. అన్ని మతాల్లో తన అభిమానులు ఉన్నారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం చేస్తానని అనిపిస్తే నాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇచ్చినా ఇవ్వకపోయినా క్రైస్తవులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.