భర్త గౌరీశంకర్ ను హత్య చేయించిన భార్య సరస్వతి సంఘటనలో కొత్త విషయం వెలుగు చూసింది.
విజయనగరం: భర్త గౌరీశంకర్ ను హత్య చేయించిన భార్య సరస్వతి సంఘటనలో కొత్త విషయం వెలుగు చూసింది. భర్తను హత్య చేయించడానికి సరస్వతి బెంగళూరు ముఠాకు సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పెళ్లయిన కొద్ది రోజులకే ఫేస్ బుక్ ప్రేమికుడు శివతో కలిసి సరస్వతి భర్తను హత్య చేయించిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందే శివతో కలిసి బెంగళూరుకు చెందిన ఓ ముఠాకు రూ.25 వేలు అడ్వాన్స్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ నగదును శివ యాప్ ద్వారా అన్ లైన్లో బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అడ్వాన్స్ తీసుకున్న ముఠా ఫోన్ ఎత్తలేదు. దీంతో గోపి ముఠాతో ఒప్పందం చేసుకుని పెళ్లి తర్వాత గౌరీశంకర్ ను హత్య చేయించిన విషయం తెలిసిందే. బెంగళూరు ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గౌరీశంకర్ హత్య కేసులో నిందితుడు గౌరీశంకర్ ను జిల్లా ఎస్పీ పాలరాజు ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్య జరిగిన రోజు నిందితుడు పార్వతీపురంలోనే ఉన్నాడని ఆయన చెప్పారు.
పార్వతీపురం వద్ద గౌరీశంకర్, సరస్వతి బైక్ పై వెళ్తుండగా ఓ ముఠా దాడి చేసింది. ఆ దాడిలో గౌరీశంకర్ మరణించాడు. అయితే, దొంగల ముఠా ఆ దారుణానికి పాల్పడినట్లు సరస్వతి నాటకం ఆడింది. ఆ నాటకానికి పోలీసులు తెరదించి పథకం ప్రకారం ఆమె తన భర్తను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో సరస్వతి ప్రేమికుడు శివను పోలీసులు అరెస్టు చేశారు.