మహిళా సాధికారత, భద్రత అంశాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్ యాత్ర చేపడుతున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు ఆమె వెళ్లారు.
అమరావతి: ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత కోసం దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపడుతున్నారు. ఈ అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెల్లడానికి ఆమె ఒంటరిగా ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. తాజాగా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆమె కలిశారు.
సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆశా మాలవ్య కలిశారు. ఆమెను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఆమె చేపడుతున్న సైకిల్ యాత్ర లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. అంతేకాదు, ఆశా మాలవ్యకు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.
సైకిల్ పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించానని సీఎం జగన్కు ఆశా మాలవ్య వివరించారు.
Also Read: అమరావతిపై ఏపీ ప్రభుత్వం పిటిషన్: ఈ నెల 23న విచారించనున్న సుప్రీంకోర్టు
మధ్యప్రదేశ్లోని రాజ్ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళల సామాజిక స్థితిగతుల్లో పురోగతి రావాలని ఒంటరిగా దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి సీఎం జగన్ను కలిశారు. ఆశా మాలవ్య కృషిని సీఎం జగన్ ప్రశంసించారు. ఈ సమావేశంలో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య, ఇతర సీఎంవో అధికారులు పాల్గొన్నారు.