ఎన్440కె వ్యాఖ్యలతో చిక్కులు: చంద్రబాబుపై గుంటూరు జిల్లాలోనూ కేసులు

By telugu teamFirst Published May 12, 2021, 6:57 AM IST
Highlights

ఎన్440కే వేరియంట్ అనే కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతోందని చేసిన వ్యాఖ్యలు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి చిక్కులు తప్పడం లేదు. ఆయనపై గుంటూరు జిల్లాలోనూ రెండు కేసులు నమోదయ్యాయి.

అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎన్440కె వేరియంట్ వ్యాఖ్యలు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఆయనపై తాజాగా గుంటూరు జిల్లాలో రెండు చోట్ల కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎన్440కే వేరియంటడ్ కోవిడ్ 19 వైరస్ పుట్టి వ్యాప్తి చెందుతోందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఆ వ్యాఖ్యలపై గుంటూరుకు చెందిన న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ అరండల్ పేట పోలీసు స్టేషన్ లోనూ, మరో న్యాయవాది రాపోలు శ్రీనివాస రావు నరసారావుపేట టూటౌన్ పోలీసు పోలీసు స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. అనిల్ కుమార్ ఫిర్యాదుపై క్రైమ్ నెంబర్ 230/2021 ఐపిసీ సెక్షన్లు 188, 501(1) బి, 505 (2) విపత్తుల నిర్వహణ చట్టం - 2005 సెక్షన్ 54 కింద చంద్రబాబుపైన, మరికొందరిపై ఆరండల్ పేట పోలీసులు కేసులు నమోదు చేశారు. 

శ్రీనివాస రావు ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేసినట్లు నరసారావుపేట సీఐ కృష్ణయ్య తెలిపారు. ఇప్పటికే చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదైంది. సుబ్బయ్య అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఎన్440కే వేరియంట్ కరోనా వైరస్ విస్తరిస్తోందని, ఇది 10-15 రెట్లు ప్రమాదకరమని చంద్రబాబు, టీడీపీ ప్రాతిిధ్య పత్రికలు, టీవీ చానెళ్లలో చేస్తున్న ప్రకటనలు ప్రజలను భయబ్రాంతాలకు గురి చేస్తున్నాయని న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ దుష్ప్రచారం వల్ల ప్రజలు, కోవిడ్ రోగులు మానసిక ఒత్తిడికి గురై మరణాల రేటు పెరిగే ప్రమాదం ఉందని వారన్నారు.

టీడీపీ నేతల వ్యాఖ్యలు వైసర్ కట్టడికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగం స్ఫూర్తిని దెబ్బ తీసేలా ఉన్నాయని వారన్నారు. వ్యాక్సిన్ ల కేటాయింపు అధికారం అధికారం పూర్తిగా తమ చేతుల్లో ఉందని కేంద్రం చెప్పినా వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తున్నారని కూడా న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. శ్మశానవాటికల్లో పరిస్థితులపై టీడీపీ అనుకూల పత్రికల్లో తప్పుడు వార్తాకథనాలు వస్తున్నాయని వారు చెప్పారు.

click me!