గురువారం రాత్రి నుండి ఇద్దరు మైనర్ అమ్మాయిలు మరో ఇద్దరు మైనర్ అబ్బాయిలు కనిపించకుండా పోయిన ఘటన గుంటూరులో కలకలం రేపింది.
గుంటూరు: ఒకేసారి నలుగురు మైనర్లు అదృశ్యమైన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. గుంటూరు పట్టణంలోని నెహ్రూ నగర్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఇంటిబయట ఆడుకుంటూ ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళనకు గురయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు, మైనర్ల తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు పట్టణంలోని నెహ్రూనగర్ కు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు(ఒకరు 14ఏళ్లు,ఇంకొకరు 15ఏళ్లు) ఇద్దరు అబ్బాయిలతో (ఒకరు 13ఏళ్లు,మరొకరు 17ఏళ్లు) గురువారం సాయంత్రం ఇంటిబయట ఆడుకుంటున్నారు. పిల్లలు ఇంటిబయటే ఆడుకుంటుండటంతో తల్లిదండ్రులు కూడా తమ పనుల్లో వుండిపోయారు. అయితే చీకటిపడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో బయటకు వచ్చి చూడగా పిల్లలు కనిపించలేదు.
read more భర్తను వదిలేసి ప్రియుడితో పరార్.. అతను నగలు తీసుకొని..!
ఆందోళనకు గురయిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్లు అదృశ్యమైన ప్రాంతాల్లోని సిసి కెమెరాల ఆధారంగా ఆఛూకీ కోసం గాలిస్తున్నారు.
ఒకేసారి నలుగురు మైనర్లు కనిపించకుండా పోవడాన్ని పోలీసులు కూడా సీరియస్ తీసుకున్నారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాలతో స్థానిక డీఎస్పీ సీతారామయ్య, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై మధుపవన్ తో పాటు మరికొందరు పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి పట్టణంతో పాటు చుట్టపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. మైనర్లు తమంతట తామే వెళ్లారా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నది తెలియాల్సి వుంది.