నువ్వు దేశభక్తుడివా.. తెలుగుదేశం భక్తుడివా, మీ పప్పులు ఏపీలో ఊడకవు : సోము వీర్రాజుపై వెల్లంపల్లి విమర్శలు

By Siva KodatiFirst Published Jan 22, 2022, 6:27 PM IST
Highlights

బీజేపీపై (bjp) విరుచుకుపడ్డారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (vellampally srinivasarao) . సోము వీర్రాజు (somu verraju) ఒరిజనల్ బీజేపీనా..? డూప్లికేట్ బీజేపీనా అంటూ మంత్రి ప్రశ్నించారు. సోము వీర్రాజు దేశభక్తుడా..? తెలుగుదేశం (telugu desam party) భక్తుడా అంటూ వెల్లంపల్లి నిలదీశారు

బీజేపీపై (bjp) విరుచుకుపడ్డారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (vellampally srinivasarao) . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు. సోము వీర్రాజు (somu verraju) ఒరిజనల్ బీజేపీనా..? డూప్లికేట్ బీజేపీనా అంటూ మంత్రి ప్రశ్నించారు. సోము వీర్రాజు దేశభక్తుడా..? తెలుగుదేశం (telugu desam party) భక్తుడా అంటూ వెల్లంపల్లి నిలదీశారు.  చంద్రబాబుతో (chandrababu naidu) కలిసి ఆలయాలను కూల్చిన చరిత్ర బీజేపీదేనని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. సోము వీర్రాజు కార్పొరేటర్‌గా కూడా పనికిరాని వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాభివృద్ధిపై కేంద్రంతో ఏనాడైనా మాట్లాడారా? అని మంత్రి సూటిగా ప్రశ్నించారు.

సోము వీర్రాజు, సీఎం రమేష్‌ (cm ramesh), సుజనా చౌదరిలు (sujana chowdary) రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కొందరు బీజేపీ వలస పక్షులు అమ్ముడుపోయారని విమర్శించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్‌ జగన్‌ పాలన చేస్తున్నారని వెల్లంపల్లి ప్రశంసించారు. చంద్రబాబు 40 దేవాలయాలు కూలిస్తే సోము వీర్రాజు ఏం చేశారని శ్రీనివాస్ నిలదీశారు. 

టీడీపీతో కలిసి ప్రభుత్వం పంచుకుంటూ గుడులు కూల్చిన ఘనత బీజేపీదేని వెల్లంపల్లి మండిపడ్డారు. ఆయన సోము వీర్రాజు కాదని, సారా వీర్రాజు అని సెటైర్లు వేశారు. అటువంటి వ్యక్తి.. వైఎస్సార్‌సీపీపై మత, కుల ముద్ర వేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో బీజేపీని ఎవరూ పట్టించుకోరని, అందుకే మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. 

మీరు కూల్చిన గుళ్లూ, గోశాలలు ఈ రోజు జగన్ నిర్మిస్తున్నారని.. మీకు హిందువులపై కపట ప్రేమ ఉందని ఎద్దేవా చేశారు. హిందువులకు ఒక్క మేలు కూడా ఏపీలో చేయలేదన్నారు. రామతీర్థం, అంతర్వేది ఘటన జరిగితే మీ కోరిక మేరకు సీబీఐ విచారణకు మూడో రోజే మా ప్రభుత్వం కోరిందని వెల్లంపల్లి గుర్తుచేశారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడి మనుషులు గుడిలోని విగ్రహాలను తీసుకెళ్తే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. 

అన్ని కులాలను, మతాలను కలుపుపోయే ప్రభుత్వం తమదని... అందరికీ మంచి చేయాలని జగన్‌ పాలన చేస్తున్నారని వెల్లంపల్లి తెలిపారు. సీఎంపై అవాకులు, చవాకులు పేల్చితే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. రూ.50లకే క్వార్టర్‌ మద్యం ఇస్తామన్న వ్యక్తి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. క్యాసినో ఉండేది గోవాలో అని .. అక్కడ ఎందుకు రద్దు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. ఏపీలో మతతత్వాలకు పప్పులు ఉడకవని ఆయన హెచ్చరించారు.

click me!