
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో పురోగతి సాధిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంత్రి రోజా ఈరోజు సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి రోజా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచల దేవస్థానం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రసాదం స్కీం పవర్ పాయింట్ను మంత్రి పరిశీలించారు.
అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. టూరిజమ్కు ఎక్కవ ఆదాయం వస్తుందంటే.. అందుకు టెంపుల్ టూరిజమే ప్రధాన కారణమని చెప్పారు. టెంపుల్స్, టూరిజమ్ అభివృద్దిలో పరుగులు తీసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న టీడీపీని జీరోకి పంపించి.. 2024 సీఎం జగన్ 175 స్థానాల్లో గెలుపును సొంతం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ అందరిని సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటారని చెప్పారు. కోవిడ్ సమయంలో ఉండవల్లి శ్రీదేవి చావు బతుకుల్లో ఉన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆమెను స్పెషల్ హెలికాఫ్టర్ పెట్టి హైదరాబాద్కు పంపించలేదా?.. పూర్తిగా కోలుకునే వరకు సీఎం జగన్ మానిటరింగ్ చేయలేదా? అని ప్రశ్నించారు.
వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల చేస్తున్న కామెంట్స్పై స్పందించిన రోజా.. ఈరోజు మాట్లాడుతున్న వాళ్లు గతంలో జగన్ చరిష్మా వల్లే గెలిచామని చెప్పారని అన్నారు. వారి పర్సనల్ ప్రాబ్లమ్స్కు జగన్ను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం జగన్ ఓ కటుంబంలా పనిచేస్తారన్నారు.
చంద్రబాబును నమ్మిన ఎన్టీఆర్కే ఎలాంటి పరిస్థితి వచ్చిందో అందరికి తెలుసునని అన్నారు. మూడు చోట్ల గెలిచామని టీడీపీ సంబరపడుతుందని ఎద్దేవా చేశారు. శాసనమండలిలో 58 స్థానాలు ఉంటే.. 45 స్థానాలు వైసీపీవేనని అన్నారు. 45 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్న తాము బాధ్యతాయుతంగా పని చేస్తున్నామన్నారు. దొడ్డిదారిన గెలిచిన వాళ్లు.. వాపు, బలుపు అని ఎగురుతున్నారని టీడీపీని విమర్శించారు. వైజాగ్, చిత్తూరు, అనంతపురం వచ్చిందని అంటున్నారని.. ఈ మూడు ప్రాంతాల నుంచి
చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణలు పోటీ చేసి గెలవాలని మంత్రి రోజా సవాల్ విసిరారు. వారి సింబల్ మీద పోటీ చేస్తే.. ఎంత వాల్యూ ఉందో తెలిసిపోతుంది కదా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామని చంద్రబాబు కలలో కూడా అనుకుని ఉండరని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామని చంద్రబాబుకు చిన్న నమ్మకం ఉన్న లోకేష్నే బరిలో దించేవాడని అన్నారు. ఏదో అలా జరిగిపోయిందని అన్నారు. జరిగింది కూడా అందరికి మంచిదేని చెప్పారు.