మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..

By Bukka SumabalaFirst Published Aug 29, 2022, 9:32 AM IST
Highlights

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాన్వాయ్ లోని కారు అదుపుతప్పి డివైడర్ కు గుద్దుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. 

చంద్రగిరి : తిరుపతి  జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తన నియోజకవర్గంలోని కార్యక్రమాలను ముగించుకుని మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం సాయంత్రం తిరుపతికి పయనమయ్యారు. ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్ గా వస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొని, రోడ్డుకి అటువైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమీక్షించిన అనంతరం.. మంత్రి కాన్వాయ్ కు మరమ్మత్తులు నిర్వహించి అక్కడి నుంచి  తిరుపతికి తరలించారు. 

ఇదిలా ఉండగా  శనివారంనాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుప్పంకు వచ్చిన ప్రతిసారి బ్లాక్ డేనే అంటూ విమర్శించారు. చంద్రబాబు మళ్లీ కుప్పంలో గెలిచేది కల మాత్రమేనని అన్నారు. కుప్పంలో తమ పార్టీ వాళ్లు ఎంతో మంది గాయపడ్డారని తెలిపారు. వైసిపి వాళ్లు  దౌర్జన్యం చేస్తున్నారని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  

టీడీపీ ఎమ్మెల్యేల కంటే చంద్రబాబు భద్రతా సిబ్బందే ఎక్కువ : విజయసాయి రెడ్డి సెటైర్లు

దమ్ముంటే రండి అంటూ చంద్రబాబు రెచ్చగొట్టేలా పిలుపునిచ్చారు  అని  మండిపడ్డారు. 33 ఏళ్ల పాటు కుప్పం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఏం చేశారని ప్రశ్నించారు.చంద్రబాబుకు మానసిక స్థితి బాగోలేదని విమర్శించారు. కుప్పంలో ఇక గెలవలేమనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. కుప్పంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనేలా టీడీపీ ప్లాన్ చేసిందని.. బయటి నుంచి జనాలను తీసుకువచ్చి దాడులు చేశారని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. కుప్పం ప్రజలు చంద్రబాబుని ఎప్పుడో వదిలేశారని అన్నారు. ఎన్నికలలోపే కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేస్తామని అన్నారు. 

click me!