
పుంగనూరులో అక్రమ కేసులు లేవన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు పెట్టే కేసులకు తమకు సంబంధం లేదన్నారు. నాటి ఘటనలో దాదాపు 50 మందికి తీవ్ర గాయాలయ్యాయని.. కొట్టండ్రా, తరమండ్రా అంటూ చంద్రబాబు రెచ్చగొట్టారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
అంతకుముందు గత శనివారం పుంగనూరులో జరిగిన ఘర్షణల్లో గాయపడ్డ పోలీసులు, వైసీసీ కార్యకర్తలను మంత్రి పెద్దిరెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనకు చంద్రబాబే కారణమన్నారు. బైపాస్ మీదుగా వెళతామని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చి.. ఆ తర్వాత పుంగనూరు పట్టణంలోకి టీడీపీ కేడర్ రావాలని చూసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూటు మార్చడం వల్ల చంద్రబాబుకు ఏమైనా జరుగుతుందన్న భయంతో పోలీసులు దానికి అంగీకరించలేదని.. కానీ ఆయన మాత్రం టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి పోలీసులపై దాడి చేయించారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
ALso Read: కాలేజ్ రోజుల నుంచి నేనే ఆయనకు టార్గెట్ .. ఓటమి భయంతోనే హింస : చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్
కాన్వాయ్లోనే టీడీపీ నేతలు తుపాకులు, రాళ్లు తెచ్చారని మంత్రి ఆరోపించారు. రాజకీయంగా పోటీ పడలేమని తెలిసి చంద్రబాబు ఈ తరహా దాడులకు తెరలేపారని మంత్రి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో రాష్ట్రంలో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. కాలేజీ సమయం నుంచి చంద్రబాబు తనను టార్గెట్ చేశారని.. మా ప్రాంతంలో మూడు ప్రాజెక్ట్లు కడుతుంటే, కేసులు వేసి అడ్డుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.