మంత్రి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితున్ని మచిలీపట్నం సబ్ జైల్ నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు బడుగు నాగేశ్వరరావును విచారించేందుకు అనుమతివ్వాలని కోరగా న్యాయస్థానం అందుకు అంగీకరించింది. రెండు రోజులపాటు అతడిని పోలీస్ కస్టడీకి అప్పగించింది. దీంతో మచిలీపట్నం సబ్ జైలు నుండి అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు చిలకలపూడి సీఐ వెంకట నారాయణ తెలిపారు.
విచారణ నిమిత్తం నిందితుడిని మచిలీపట్నం పోలీస్ స్టేషన్ తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భారీ బందోబస్తు మధ్య నిందితుడిని తరలించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు టీడీపీ ముఖ్య నేతలను కూడా పోలీసులు విచారించారు.
వీడియో
ఇక ఇదే వ్యవహారంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కృష్ణా జిల్లా పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఇదే నియోజకవర్గంలో గతంలో మంత్రి పేర్నినాని అనుచరుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ హత్యకు గురయ్యాడు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా కాలం పాటు జైల్లో ఉండి ఇటీవలనే కొల్లు రవీంద్ర విడుదలయ్యారు.
ఈ క్రమంలోనే తాజాగా మంత్రిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు అతడికి నోటిసులు జారీచేయడంతో రాజకీయంగా పలురకాల చర్చలకు దారితీసింది. మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు సీఆర్సీపీ 91 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు.
నవంబర్ 29వ తేదీన మంత్రి పేర్నినానిపై ఆయన ఇంట్లోనే నాగేశ్వరరావు అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.పేర్నినాని ఆనుచరులు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
మద్యం మత్తులో నాగేశ్వరరావు మంత్రిపై దాడికి దిగారని గుర్తించారు. నాగేశ్వరరావును కూడ కస్టడీకి తీసుకొని విచారణ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగేశ్వరరావును కస్టడీకి తీసుకొనేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అందుకు న్యాయస్థానం అంగీకరించింది.