
విజయవాడ దుర్గగుడి ఈవో, ట్రస్టు బోర్డు చైర్మన్ మధ్య వివాదంపై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఏసీబీ అధికారుల దాడులపై.. ఈవోపై విమర్శలు చేయడం తగదన్నారు. మంత్రిని కాదని సీఎం జగన్కు ఈవోపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. వివాదంపై విచారణ చేయాలని సీఎం ఆఫీస్ మళ్లీ తనకే పంపిస్తుందని అన్నారు. అవినీతి అధికారుల విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబ, ట్రస్టుబోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆలయ సూపరింటెండెంట్ వాసా నగేష్పై ఏసీబీ దాడులు తర్వాత ఈ వివాదం మరింతగా ముదిరింది. ఆలయంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ట్రస్ట్బోర్డు ఛైర్మన్ కర్నాటి రాంబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఏసీబీ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపేందుకు వీలుగా ఈవో భ్రమరాంబను బదిలీ చేయాలని ట్రస్ట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
నగేష్ అవినీతికి వ్యతిరేకంగా మార్చి 18న ఈవో భ్రమరాంబకు ఫిర్యాదు చేసినట్లు ట్రస్ట్ బోర్డు ఆరోపించింది. అయినా అవినీతి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతోంది. ట్రస్టు బోర్డు చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తాము చేసిన వినతులను ఈవో పట్టించుకోలేదని విమర్శించారు. ఈవో పరోక్షంగా అవినీతికి మద్దతిస్తున్నారని ఆరోపించారు.