పారిపోయేవాళ్లు ఎవరో ప్రజలందరికి తెలుసు అని అన్నారు. చంద్రగిరి వదిలి కుప్పం పారిపోయింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారు. కాగా.. తాజాగా ఈ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.
చంద్రబాబునాయుడు ఓ ఫేక్ ప్రతిపక్ష నేత అని.. టీడీపీ ఓ ఫేక్ పార్టీ అంటూ ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పారిపోయేవాళ్లు ఎవరో ప్రజలందరికి తెలుసు అని అన్నారు. చంద్రగిరి వదిలి కుప్పం పారిపోయింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.
‘‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయారు. ఇక కరోనా రాగానే కాల్వగట్టు నుంచి హైదరాబాద్కు పారిపోయారు. ఆయనో ఫేక్ ప్రతిపక్షనేత’’ అంటూ చురకలు అంటించారు. ‘‘చంద్రబాబు పాలనలో ఒక్క పెన్షన్ కూడా పెంచలేదు. టీడీపీ హయాంలో ఎవరైనా చనిపోతేనే కొత్త పింఛన్ ఇచ్చేవారు.. కానీ సీఎం జగన్ వచ్చాక అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నాం. ఒకటో తారీఖునే ఠంచనుగా పింఛన్ అందిస్తున్నాం’’ అని తమ ప్రభుత్వ తీరును వివరించారు.
అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు. సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ధీరుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రజామోదంతో సీఎం అయ్యారు. వెన్నుపోటు రాజకీయాలు ఆయనకు తెలియవు. చంద్రబాబు మెప్పు కోసమే టీడీపీ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే సభను తప్పదోవ పట్టించాలని చూస్తున్నారు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ సభ్యుల తీరును విమర్శించారు.