ఆ రాయి చంద్రబాబు వేయించుకున్నదే.. ఇదో కొత్త డ్రామా : నందిగామ ఘటనపై జోగి రమేశ్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Nov 04, 2022, 09:29 PM IST
ఆ రాయి చంద్రబాబు వేయించుకున్నదే.. ఇదో కొత్త డ్రామా : నందిగామ ఘటనపై జోగి రమేశ్ వ్యాఖ్యలు

సారాంశం

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనపై స్పందించారు మంత్రి జోగి రమేశ్. ఆ రాయి వేయించుకున్నది చంద్రబాబేనని.. ఆయన కొత్త డ్రామాకు తెరదీశారని ఆయన ఆరోపించారు. 

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటన ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై తెలుగుదేశం నేతలు అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షానికి ధీటుగా బదులిచ్చారు మంత్రి జోగి రమేశ్. రోడ్ షోలో పడ్డ రాయిని చంద్రబాబే విసిరించుకున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశారని.. రాళ్ల దాడి ఘటన దీనిలో భాగంగానే జరగిందని జోగి రమేశ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటనలో సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడటం బాధాకరమని ... బాధితుడైన అధికారికి క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబేనని మంత్రి పేర్కొన్నారు. 

వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం తరపున అభ్యర్ధులను దించే ధైర్యం చంద్రబాబుకు వుందా అని జోగి రమేశ్ ప్రశ్నించారు. అటు తాను సీఎం అభ్యర్ధినని చెప్పే దమ్ము జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వుందా అని మంత్రి నిలదీశారు. పొత్తులతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అది సాధ్యం కాదని జోగి రమేశ్ జోస్యం చెప్పారు. 

ALso REad:చంద్రబాబుపై దాడి .. ఆయన కనుసైగ చేస్తే తట్టుకోలేరు, ఎగిరిపడితే బడిత పూజే : జగన్‌కు అచ్చెన్న వార్నింగ్

అంతకుముందు రాళ్ల దాడి ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడి వైసీపీ రౌడీ రాజకీయానికి పరాకాష్ట అన్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఏసీలో ఉండి కూడా జగన్ రెడ్డికి చెమటలు పడుతున్నాయని అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. ఒక పార్టీ జాతీయ అధ్యక్షునిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రౌడీ రాజకీయాలతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం పగటి కల అని జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే మా కార్యకర్తల చేతిలో వైసీపీ గుండాల పరిస్థితి ఏంటి అని ఆయన హెచ్చరించారు. అధికారం ఉంది కదా అని బరి తెగిస్తే బడితే పూజ తప్పదని అచ్చెన్నాయుడు హితవు పలికారు. దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడి పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ  వైఫల్యమేనని.. జగన్ రెడ్డి పట్టపగలే ప్రజాస్వామ్యన్ని హత్య చేస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి తమ కార్యకర్తలకి ఎదుటివారిపై దాడులు చేయమని లైసెన్సులు ఇచ్చి రోడ్ల మీదకి వదిలినట్టున్నారని రామకృష్ణుడు ఆరోపించారు. పార్టీ జాతీయ అధ్యక్షునిపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా అని యనమల మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, డీజీపీ వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 

కాగా... ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డు షోలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ర్యాలీపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu