
విజయనగరం: భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపకు అంతా సిద్దమైనట్టుగా తెలుస్తోంది. మే 3న భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన జరగనుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మంత్రి అమర్నాథ్ ఈరోజు అధికారులతో కలిసి భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన భూముల్లో పర్యటించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన జరిగే ప్రధేశాన్ని పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ మే 3వ తేదీనభోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. దాదాపు 2,200 ఎకరాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుందని చెప్పారు. శంకుస్థాపన చేసిన నాటి నుంచి పనులు ప్రారంభించి 24 నుంచి 30 నెలల్లో నిర్మాణం పనులు పూర్తి చేస్తామని తెలిపారు.