చంద్రబాబు 27 ఏళ్ల యువకుడా.. అది అనితకు ఎలా తెలుసు?: మంత్రి అమర్‌నాథ్ సంచలన కామెంట్స్

By Sumanth KanukulaFirst Published Jun 27, 2022, 4:52 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ నాయకులపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ఓర్వలేకే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలుగుదేశం పార్టీ నాయకులపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఏర్పాటు చేసిన వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ప్లీనరీ‌లో పాల్గొన్న గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న ప్రతిఒక్కరి హోదా, అధికారం.. జగన్ మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ వల్లనే అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మోహం చూసే తమకు ఈ స్థాయి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ఓర్వలేకే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంతంగా ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన సందర్భాలు లేవన్నారు. ఎన్టీఆర్‌ని గద్దె దించి తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచారని అన్నారు. 2014లో బీజేపీ, జనసేన అండగా మరోసారి చంద్రబాబు.. సీఎం అయ్యారని, తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఏం జరిగిందో చూశామని చెప్పారు. 

అదే సమయంలో టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనితపై మంత్రి అమర్‌నాథ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అనిత ఈ మధ్య కాలంలో సీఎం జగన్‌పై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు 72 సంవత్సరాల ముసలోడు కాదు.. 27 సంవత్సరాల యువకుడు అని అనిత పదేపదే చెబుతోందని..  అది ఆమెకు ఎలా తెలిసింది’’ అని అన్నారు. అనిత అన్నమాటే తాను చెబుతున్నానని అన్నారు. చంద్రబాబు 27ఏళ్ల యువకుడిలా పనిచేస్తుంటే.. 35 ఏళ్ల లోకేష్ ఎందుకు పనిచేయలేకపోతున్నాడో కూడా చెప్పాలని ప్రశ్నించారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ నాయకత్వ లక్షణాలతో చంద్రబాబు, లోకేష్‌తో సహా ఏ టీడీపీ నాయకుడూ సరితూగలేరని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీకి అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ కూడా వైసీపీకి సాటిరాదన్నారు.

click me!