టీడీపీ కోసమే జనసేన పార్టీ... సర్వే రిజల్ట్స్‌తో చంద్రబాబు, పవన్‌ వణుకుతున్నారు : మంత్రి దాడిశెట్టి రాజా

By Siva KodatiFirst Published Aug 16, 2022, 5:08 PM IST
Highlights

పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించింది టీడీపీ అధినేత చంద్రబాబుకు కొమ్ముకొయడానికేనని విమర్శించారు మంత్రి దాడిశెట్టి రాజా. చంద్రబాబుకు కష్టమొచ్చినప్పుడల్లా పవన్ ఆదుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 

జనసేన (janasena) అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌పై (pawan kalyan) మండిపడ్డారు మంత్రి దాడిశెట్టి రాజా (dadisetti raja) . మంగళవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ స్వాతంత్ర్య స్పూర్తితో జనసేనను స్థాపించలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కష్టమొచ్చినప్పుడల్లా కొమ్ముకాయడానికే పార్టీని స్థాపించారని మంత్రి ఆరోపించారు. ఆ విధంగానే పవన్ అడుగులు వేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పవన్ విన్యాసాలు వున్నాయని రాజా చురకలు వేశారు. పవన్‌కు దమ్ముంటే 175 అసెంబ్లీ సీట్లలో 25 ఎంపీ సీట్లలో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. సర్వేల్లో ప్రజల పల్స్ చూసి పవన్, చంద్రబాబులకు వణుకుపుడుతోందని మంత్రి సెటైర్లు వేశారు. 

ఇకపోతే.. జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన పవన్ కల్యాణ్..  రాజకీయపరంగా తనను ఎదుర్కోలేకనే కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి, యువతకు ఉపాధి కోసం ప్రశ్నిస్తే.. సీఎం జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. కులం చూసుకుని రాజకీయం చేస్తే గత ఎన్నికల్లో తనకు 40 సీట్లు వచ్చేవని అన్నారు. ఓట్ల కోసం మత రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మత ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి కావాలని అన్నారు. మసీదు, చర్చికి అపవిత్రం జరిగితే ఏ విధంగా ఖండిస్తామో ఆలయాలకు అపవిత్రం జరిగినా బలంగా ఖండిస్తేనే సెక్యులరిజమని పవన్ చెప్పారు.

ALso Read:వరదల్ని రాజకీయాలకు వాడతారా : పవన్‌పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు

ఢిల్లీకి వెళ్లి వైసీపీ ఎంపీలు ఏం  చేస్తారో తనకు తెలుసని అన్నారు. వీరి అధికారం సామాన్యులను చావగొట్టడానికి తప్ప.. ప్రధాని ముందు నోరు మెదపరని అన్నారు. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు మారవని అన్నారు. ఉన్న వ్యవస్థలను బలోపేతం చేస్తే చాలా పనులు జరుగుతాయని అన్నారు. భీమ్లా నాయక్ సినిమా ఆపడానికి ఎమ్మార్వో నుంచి చీఫ్ సెక్రెటరీ దాకా అందరూ పనిచేశారని విమర్శించారు. విధ్వంసం కోసం వ్యవస్థలను వాడేవాళ్లు.. దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వడానికి, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎందుకు వాడరని ప్రశ్నించారు.      

వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసి అభివృద్ధి అంటోందని.. రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్​ చేశారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని.. వైసీపీ నేతలకు కాదని అన్నారు. ప్రభుత్వం ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతుందని మండిపడ్డారు. బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.  

click me!