వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం మొత్తం రాజకీయాల్లో వున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మీ గతంలో ఎంపీగా పనిచేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ఆమె విశాఖ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది
వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం మొత్తం రాజకీయాల్లో వున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మీ గతంలో ఎంపీగా పనిచేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ఆమె విశాఖ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై బొత్స సత్యనారాయణ స్పందించారు. ఝాన్సీ పోటీ ప్రస్తుతానికి అప్రస్తుతమని, దీనిపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని, హైకమాండ్ సూచనలను బట్టి నిర్ణయం వుంటుందని బొత్స స్పష్టం చేశారు.
ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రేన్లు, జాకీలు పెట్టినా చంద్రబాబు లేవలేడన్నారు. వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పుపై ఆందోళనలు చేయడం తప్పని, అసంతృప్తితో వున్న వాళ్లతో మాట్లాడుతున్నామని ఆయన పేర్కొన్నారు. పార్టీని వీడాలని ఎవరూ కోలుకోవడం లేదని, ఒకరు వెళితే వందమంది వస్తారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
మరోవైపు.. బొత్స సత్యనారాయణ వైసీపీని వీడుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానచలనం, టికెట్ల నిరాకరణ ఆయనను టెన్షన్ పెడుతున్నాయట. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కొన్నింటిని బొత్స తప్పుబడుతున్నట్లుగా వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొందరు సీనియర్లను మాత్రం కొనసాగించాలన్నది సత్యనారాయణ అభిప్రాయం. బొత్స చేరుతానంటే జనసేన, కాంగ్రెస్ రెండూ ఆహ్వానించడానికి సిద్ధంగా వున్నాయి. గతంలో పీసీసీ చీఫ్గా చేసిన అనుభవంతో పాటు పలు హోదాల్లో సుదీర్ఘ ప్రస్థానం బొత్స సొంతం.