తాను ఎవరిపై విమర్శలు చేయలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. మనిషి పెరగడం కాదు.. బుర్ర పెరగాలి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన రాజధానిగా అమరావతిని అభివృద్ది చేస్తామని తెలిపారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని ఆరోపించారు. చంద్రబాబు హైదరాబాద్లో ఎందుకున్నారని.. అమరావతిని ఎందుకు రాలేకపోయారని ప్రశ్నించారు. అమరావతి అడ్రస్ లేకుండా ఐదేళ్లు సీఎంగా పాలించడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే హైదరాబాద్ విషయాన్ని ప్రస్తావించానని చెప్పుకొచ్చారు.
విభజన సమయంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని.. ఈలోగా రాజధాని ఏర్పరచుకోవాలని శివరామకృష్ణ కమిటీని వేసి కొన్ని సూచనలు చేసిందని మంత్రి బొత్స గుర్తుచేశారు. కానీ చంద్రబాబు వీటిని పట్టించుకోకుండా స్వార్ధం కోసం అమరావతిని రాజధాని అని ప్రకటించారని చెప్పారు. స్వలాభం కోసమే రాజధాని అమరావతి అని చంద్రబాబు చట్టం కూడా చేశారని ఆరోపించారు.
2024 వరకు ఏపీకి రాజధాని హైదరాబాద్ అని ఆయన వ్యాఖ్యానించగా టీడీపీ నేతలు విమర్శలు చేశారు. దీంతో టీడీపీ నేతలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరిపై విమర్శలు చేయలేదని.. ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. మనిషి పెరగడం కాదు.. బుర్ర పెరగాలి అంటూ విమర్శలు చేశారు.