జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నటించిన వకిల్ సాబ్ సినిమాకు టిక్కెట్ల రేట్లు పెంచి అభిమానులను, ప్రజలను దోచుకున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.
నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి ఓడిపోతే 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా సవాలు విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించే దమ్ము, ధైర్యం టిడిపికి, ఆ పార్టీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే ఈ సవాల్ విసిరగా టిడిపి నేతలు తోకముడిచి పారిపోయారని అనిల్ ఎద్దేవా చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి సభను వాయిదా వేసుకుంటే టిడిపి నేతలు కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నటించిన వకిల్ సాబ్ సినిమాకు టిక్కెట్ల రేట్లు పెంచి అభిమానులను, ప్రజలను దోచుకున్నారని అన్నారు. వకిల్ సాబ్ వెనక వేసుకొని చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నాడన్నారు. నీది ఏ పార్టీ... నువ్వు ఎవరికి సమర్థిస్తున్నావో చెప్పు అని అనిల్ నిలదీశారు.
వందమంది వకీల్ సాబ్ లు వచ్చినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ఏమి చేయలేరన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ సాబ్ లకి భయపడడన్నారు. ఈ రాష్ట్రంలో ఒకరే సాబ్... సీఎం సాబ్ .... అది జగన్ సాబ్ అని అన్నారు.
read more పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ వివాదం: హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా 20శాతం స్థానిక సంస్థలలో కూడా గెలవలేకపోయారని పేర్కొన్నారు. చంద్రబాబుకు కుప్పంలో... ఆయన తనయుడు నారా లోకేష్ కు మంగళగిరిలో ప్రజలు దూల తీర్చారని విమర్శించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఉన్నాయో... టీడీపీకి ఉన్నాయో తిరుపతి ఉపఎన్నిక ఫలితం తర్వాత తేలిపోతుందన్నారు.
టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుపై కూడా మంత్రి విరుచుకుపడ్డారు. అచ్చెన్నాయుడు దున్న లాగా పెరిగాడు గాని అతనికి మైండ్ మాత్రం పెరగలేదంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.