వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌లపై జరిగిన దాడిపై పవన్ సమాధానం చెప్పాలి.. అంటి రాంబాబు ఫైర్

By Sumanth KanukulaFirst Published Oct 15, 2022, 5:46 PM IST
Highlights

విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల కార్లపై ఎయిర్‌పోర్ట్ వద్ద కొందరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల కార్లపై ఎయిర్‌పోర్ట్ వద్ద కొందరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలే ఈ దాడులుకు పాల్పడినట్టుగా వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. జనసేన కార్యకర్తలు తమ కార్లపై దాడి చేశారని.. తమ కార్యకర్తలు గాయపడ్డారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. 

ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌లపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. 

Latest Videos

 

వై వి సుబ్బారెడ్డి,జోగి రమేష్ లపై
విశాఖ ఎయిర్పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి!

— Ambati Rambabu (@AmbatiRambabu)


అలాగే ఈ ఘటనపై అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే మాటల వల్లే ఇలాంటి దుష్టశక్తులు తయారయ్యాయని విమర్శించారు. అసాంఘిక శక్తులకు నాయకత్వం వహించే బాస్ పవన్ కల్యాణ్ అని ఆరోపించారు. జనసైనికులు కర్రలు తీసుకుని వచ్చారా? లేదా? అనే దానికి సమాధానం చెప్పాలన్నారు. 

Also Read: రోజా, జోగి రమేశ్, వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన శ్రేణుల దాడి.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత

ఇక, పవన్ కల్యాణ్ విశాఖలో మూడు రోజులు ఉండనున్నారు.  ఇందుకోసం శనివారం సాయంత్రం విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీంతో పవన్ కల్యాణ్ జనసేన కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో.. ఎయిర్‌పోర్టు వద్ద థింసా నృత్యం, తప్పెటగుళ్ళు, కోలాటం లాంటి సంప్రదాయ కళాకారుల ప్రదర్శనలు నిర్వహించడంతో అక్కడ కోలాహలం నెలకొంది. 

పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో.. ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపడుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, తాటిచెట్ల పాలెం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, ఎన్టీఆర్ విగ్రహం (బీచ్ రోడ్) మీదుగా నోవాటెల్ వరకు జనసేన ర్యాలీ చేపట్టనున్నారు. తన పర్యటనలో భాగంగా నేడు విశాఖపట్నం అర్బన్, రూరల్ పరిధిలోని జనసేన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జనసేన భవిష్యత్తు కార్యాచరణపై పవన్‌ కల్యాణ్ పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

రేపు (అక్టోబర్ 16) ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలపై వచ్చే ఆర్జీలను పవన్ కల్యాణ్ స్వీకరించనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అక్కయపాలం హైవే రోడులోని పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా జనసేన వర్గాలు తెలిపాయి. 

ఇక, రేపు సాయంత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 17వ తేదీ ఉదయం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం బీచ్ రోడ్డులోని వైఎంసీఏ హాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం కానున్నారు. 

click me!