గవర్నమెంట్ స్కూల్ విద్యార్ధులతో ఇంగ్లీష్‌లో మాట్లాడగలావా : పవన్‌కు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్

By Siva KodatiFirst Published Oct 21, 2023, 6:30 PM IST
Highlights

దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులతో ఇంగ్లీష్‌లో మాట్లాడి చూపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు సవాల్ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఇంటర్ ఫెయిలైన పవన్ చదువు గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ ఫెయిలైన పవన్ చదువు గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. ఆయనకు దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులతో ఇంగ్లీష్‌లో మాట్లాడి చూపించాలని సవాల్ విసిరారు. ఐక్యరాజ్యసమితి వేదికపై పేద విద్యార్ధులు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని.. కానీ పవన్ మాత్రం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. ఇంగ్లీష్ మీడియంపై ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. 

అటు తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్‌లపైనా మంత్రి ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడితే 48 గంటల్లో విడిపిస్తానన్న లోకేష్.. తన తండ్రి నెలరోజుల నుంచి జైల్లో వుంటే బయటకు తీసుకురాలేకపోయారని ఆదిమూలపు సురేష్ సెటైర్లు వేశారు. పాపం పండటం వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లారని.. లోకేష్, పవన్ కళ్యాణ్‌లకే ఎలాంటి గ్యారెంటీ లేదని, అలాంటప్పుడు వారు ప్రజలకు ఏం చేస్తారని మంత్రి ప్రశ్నించారు. 

Also REad: తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది.. వైఎస్ఆర్సీపీ స‌ర్కారు రూ.3.29 లక్షల కోట్లు స్వాహా చేసింది : టీడీపీ

అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పల్లకీ మోయడానికే పవన్ పార్టీ పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు సొంత కొడుకుపై నమ్మకం లేకే సినీ గ్లామర్‌తో పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారని మార్గాని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి.. పవన్ కల్యాణ్‌కు నోట్లు కావాలని ఎంపీ ఆరోపించారు. చంద్రబాబు అవినీతి కుంభకోణంలో అరెస్ట్ కావడంతో పవన్ కల్యాణ్ రథసారథి పాత్ర పోషిస్తున్నారని భరత్ దుయ్యబట్టారు. 

టీడీపీ, జనసేనలు రాజమండ్రిలో భేటీ అయినంత మాత్రాన ఫలితం ఏం వుండదని.. చంద్రబాబు 40 రోజులు జైల్లో వుంటేనే ఎలాంటి స్పందనా లేదని ఆయన చురకలంటించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర వున్న చంద్రబాబు.. తాను అరెస్ట్ అయితే జనం ఎందుకు స్పందించడం లేదో గ్రహించాలన్నారు. ఆయన రాజకీయాలు అర్ధమయ్యాయి కాబట్టే జనంలో స్పందన , సానుభూతి కనిపించడం లేదన్నారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయ కార్యాచరణ లేదని.. పదీ పదిహేను మందికి డబ్బులిస్తే సరిపోతుందా అని మార్గాని భరత్ ప్రశ్నించారు. వైసీపీ పాలనకు నూటికి నూరు శాతం ప్రజలు మద్ధతు ఇస్తారని ఎంపీ స్పష్టం చేశారు. 

click me!