తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని చూసి బోరున విలపించిన కుమారుడు.. కొనసాగుతున్న అంతిమయాత్ర..

Sumanth K | Published : Feb 23, 2022 9:43 AM

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి (Mekapati Goutham Reddy) కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం అర్దరాత్రి నెల్లూరుకు చేరుకున్నారు.  డైకస్ రోడ్డులోని ఇంటికి చేరుకుని తండ్రి భౌతికకాయాన్ని చూసి  కృష్ణార్జున రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి (Mekapati Goutham Reddy) అంత్యక్రియలు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణ వార్త తెలిసిన వెంటనే అమెరికాలో ఉన్న ఆయన కుమారుడు కృష్ణార్జున రెడ్డి ఇండియాకు బయలుదేరారు.  అమెరికా నుంచి నేరుగా ఆయన చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. మంగళవారం రాత్రి 11 గంటల దాటిన తర్వాత కృష్ణార్జున రెడ్డి నెల్లూరులోని నివాసానికి చేరుకున్నారు. 

అక్కడ ఉంచిన తండ్రి భౌతికకాయాన్ని చూసి కృష్ణార్జున రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటికి చేరుకోగానే తండ్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయం వద్ద నుంచి అందరూ బయటకు వెళ్లాని కృష్ణార్జునరెడ్డి కోరారు. తర్వాత తండ్రి తండ్రి యదపై సున్నితంగా తన చేయితో నిమురుతూ బోరున విలపించారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో దుఃఖ సాగరంలో మునిగిపోయిన మేకపాటి కుటుంబం.. ఆ సన్నివేశాన్ని చూసి గుండెలవిసేలా రోధించింది. తండ్రి భౌతికకాయం వద్ద కృష్ణార్జున రెడ్డి విలపించిన తీరు అక్కడున్నవారిని కలిచివేసింది. 

కొనసాగుతున్న గౌతమ్ రెడ్డి అంతిమ యాత్ర.. అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం  జగన్
గౌతమ్ రెడ్డి అంతిమ యాత్ర బుధవారం ఉదయం డైకస్ రోడ్డులోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైంది. అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.  జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరు పాలెం, మర్రిపాడు, సరిహద్దు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరిలోనే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి అంతిమ యాత్రలో భారీగా ప్రజలు, అభిమానులు పాల్గొంటున్నారు.

గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు (Last rites) అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. గౌతమ్ రెడ్డి భౌతికకాయం కళాశాల గ్రౌండ్‌కు చేరుకున్న అనంతరం.. ప్రజలు, స్థానికుల సందర్శనార్థం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత 11 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.

గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఇందుకోసం సీఎం జగన్ ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి 10.45 గంటలకు కడప చేరుకుంటారు. అనంతరం ఉదయం 11.15 గంటలకు ఛాపర్‌లో ఉదయగిరి చేరుకుంటారు. గౌతమ్ రెడ్డికి భౌతికకాయానికి నివాళులర్పించనున్న సీఎం జగన్.. అరగంటపాటు అక్కడే గడపనున్నారు. అనంతరం కడపకు వెళ్లిన సీఎం అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అశ్రునివాళి..
ఇక, సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని.. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు తరలించారు. నెల్లూరుకు తీసుకొచ్చారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి డైకస్ రోడ్డులోని ఆయన నివాసానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. గౌతంరెడ్డి పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్న వాహనాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో అనుసరించారు. ‘గౌతమ్‌ రెడ్డి అమర్‌ రహే... జోహార్‌’ అంటూ నినాదాలు చేశారు. 

ప్రజలు, అభిమానుల సందర్శనార్థం కస్‌రోడ్‌లోని నివాసంలో గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఉంచారు. రాష్ట్ర మంత్రులు మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసులు, ఆదిమూలపు సురేష్, కే నారాయణ స్వామి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నెల్లూరుకు విచ్చేసి గౌతంరెడ్డికి నివాళులర్పించారు. అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. 

click me!