ఒక్క మాట మీద నిలబడింది పవన్ మాత్రమే.. నాగబాబు

By telugu news teamFirst Published Aug 3, 2020, 9:56 AM IST
Highlights

ప్రభుత్వమే మోసం చేస్తోందని, ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారకులు చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. ఆనాడు చేసిన తప్పిదాల వల్లనే ఇవాళ జగన్ తనకు అనుకూలంగా మార్చుకొని రాజధాని తరలించుకొని వెళ్తున్నారని నాగబాబు విమర్శించారు.
 

మొదటి నుంచి రాజధాని విషయంలో ఒక్కమాట మీద నిలబడింది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమేనని మెగా బ్రదర్ నాగబాబు పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతి కోసం వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని, ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తాజాగా.. నాగబాబు జనసేన పార్టీ పొలిటికల్ కమిటీ టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఇలా చేస్తే ప్రభుత్వం మీద ప్రజలకు భరోసా పోతుందన్నారు. ఇకపై భూ సమీకరణలు, భూసేకరణలు చేపడితే ప్రజలు ఏం నమ్మి భూములు ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

రాజధాని విషయంలో మొదటి నుంచి ఒకే విధానం, ఒకే మాట మీద ఉన్నది జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రమేనని నాగబాబు అన్నారు. అన్ని వేల ఎకరాల భూమిని సమీకరిస్తే ఏదైనా సమస్య ఉత్పన్నమైతే రైతులకు ఎవరు భరోసాగా ఉంటారని 2015లోనే బలంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారని, ఇప్పుడు రాజధాని తీసుకువెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుందన్నారు. 

ప్రభుత్వమే మోసం చేస్తోందని, ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారకులు చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. ఆనాడు చేసిన తప్పిదాల వల్లనే ఇవాళ జగన్ తనకు అనుకూలంగా మార్చుకొని రాజధాని తరలించుకొని వెళ్తున్నారని నాగబాబు విమర్శించారు.


జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ టెలీ కాన్ఫరెన్స్  పార్టీ  ప్రధాన కార్యదర్శి తోట చంద్ర శేఖర్ మాట్లాడుతూ రాజధాని వికేంద్రీకరణకు పూర్తి స్థాయిలో ప్రజామోదం కనిపించడం లేదన్నారు. ప్రజలు ఉద్యమించాలన్నా కోవిడ్ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవని, ఈ అంశంపై న్యాయపరమైన పోరాటం చేపట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. 

click me!