కూతుళ్లను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

By telugu teamFirst Published Oct 14, 2019, 10:23 AM IST
Highlights

ఒకరు కాలుజారి గుంతలో పడడంతో ఒకరినొకరు రక్షించుకోబోయి అందరూ గుంతలో మునిగిపోయారు. ఇది గుర్తించిన తండ్రి బుద్ధారాం, మరికొందరు నీటిలోకి దిగారు. ముగ్గురు ఆడపిల్లల్ని గట్టుకు చేర్చారు. వారికి ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే ఈతరాక నీటిలో మునిగిపోయిన బుద్ధారాంను ఎవరూ గుర్తించలేకపోయారు. 
 

కూతుళ్ల ప్రాణాలు కాపాడబోయి ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. పొరపాటున నీటి గుంతలో పడిపోయిన ముగ్గురు కుమార్తెలను కాపాడేందుకు నీటిలో దిగి... అతను ప్రాణాలు కోల్పోయాడు.  సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన బుద్ధారాం(46)  పులిచెర్ల మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ ముప్పిరెడ్డిగారిపల్లె వద్ద నుంచి క్వారీలో రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు.  బుద్దారాంకి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా ఆయన ముగ్గురు  కుమార్తెలు సుకుమతి(13), లీక్మీ(18), కేసి(19)లు ఆదివారం క్వారీ గుంతలో బట్టలు ఉతకడానికి దిగారు. 

ఈ క్రమంలో ఒకరు కాలుజారి గుంతలో పడడంతో ఒకరినొకరు రక్షించుకోబోయి అందరూ గుంతలో మునిగిపోయారు. ఇది గుర్తించిన తండ్రి బుద్ధారాం, మరికొందరు నీటిలోకి దిగారు. ముగ్గురు ఆడపిల్లల్ని గట్టుకు చేర్చారు. వారికి ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే ఈతరాక నీటిలో మునిగిపోయిన బుద్ధారాంను ఎవరూ గుర్తించలేకపోయారు. 

గుర్తించిన వెంటనే నీటిలో దిగి అతన్ని బయటికి తీశారు. అయితే అప్పటికే  అతను మృతి చెందాడు. సమాచారాన్ని కల్లూరు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బుద్ధారాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. 
 

click me!