
కృష్ణా : ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది తల్లి, ముగ్గురు కూతుళ్లను కత్తితో నరికాడు. ప్రేమను నిరాకరించారనే కారణంతో దారుణానికి తెగ బడ్డాడో ప్రేమోన్మాది. కత్తితో ఇంట్లోకి చొరబడి తల్లి, ముగ్గురు కుమార్తెల పై దాడి చేశాడు. అది గమనించిన తల్లి, కుమార్తెలు భయంతో అరుస్తూ ఇంట్లో నుంవి బయటకు పరుగులు పెట్టారు. వీరి కేకలు విని స్థానికులు రావడంతో ప్రేమోన్మాది జోయల్ అక్కడినుంచి పరారయ్యాడు.
బాధిత యువతి మాట్లాడుతూ.. ‘జోయల్ కొంతకాలంగా మా అక్క వెంటపడుతున్నాడు. ఇష్టపడ్డానని, ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. మా అక్క తనకు ఇష్టం లేదని చెప్పింది. మా వాళ్లు కూడా అతడిని మందలించి.. తమకు ఇష్టం లేదని పంపేశారు. దీంతో అతను పగబట్టాడు.
ఇది మనసులో పెట్టుకుని మా పై కత్తితో దాడి చేశాడు. ముందు ఇంట్లో ఉన్న మాచెల్లిని కత్తితో నరికాడు. ఇది చూసి కేకలు పెట్టిన మా అక్క పైన కూడా దాడి చేశాడు. అది చూసి భయంతో బయటకు పరుగులు పెడుతున్న నా పైన, మా అమ్మ పైన కూడా కత్తితో దాడి చేశాడు. దీంతో మేము గట్టిగా అరిచాం. మా అరుపులు విన్న చుట్టుపక్కలవాళ్లు వచ్చారు. వాళ్లు రావడం చూసిన జోయల్ అక్కడి నుంచి పారిపోయాడు’ అని చెప్పుకొచ్చింది.
బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘మా అమ్మాయిని ప్రేమించానని వచ్చాడు. మేము వద్దన్నాం. దీంతో అది మనసులో పెట్టుకుని ఇంత దారుణానికి తెగబడ్డాడు. ప్రేమను ఒప్పుకోపోతే నరికి చంపేస్తారా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నా బిడ్డలకు ఈ పరిస్థితి తెచ్చిన జోయల్ ను వదిలి పెట్టకూడదు అన్నారామె. ఇంట్లో ఉన్న మా అందరి పైనా కత్తితో దాడి చేశాడు. అందరికీ గాయాలయ్యాయి. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. ఏ తల్లికి ఇటువంటి కష్టం రాకుండా చూడాలి..అని ఆమె డిమాండ్ చేసింది.