
70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం విజయవాడలో ఏపీ పీసీసీ నేతలతో ఖర్గే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సంస్థలను బీజేపీ అమ్మేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలు ఎక్కడ వచ్చినా మోడీ, అమిత్ షాలు మత విద్వేషాలు రెచ్చగొడతారని ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఎన్నికల బరిలో దిగానని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేసే అరుదైన అవకాశం తనకు లభించిందని... తాను ఇప్పటికే పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్నానని ఖర్గే తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం చేశానని.. 2009లో సోనియా గాంధీ సూచనల మేరకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశానని మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. కేంద్ర కార్మిక శాఖ, సోషల్ జస్టిస్ మంత్రిగా చేశానని... సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉండడానికి నిరాకరించడంతో ఎన్నిక అనివార్యమైందని ఆయన వివరించారు.
Also Read:బీజేపీ చరిత్రలో ఇలాంటి ఎన్నిక ఎప్పుడూ జరగలేదు.. మల్లికార్జున ఖర్గే
అధ్యక్ష స్థానంలో గాంధీ కుటుంబం వ్యక్తులు లేకపోవడం బాధాకరమని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సూచనల మేరకు అధ్యక్ష స్థానానికి అభ్యర్థిగా నిలిచానని... ఏపీ నుంచి వచ్చిన వాళ్లు దేశాన్ని నిర్దేశనం చేశారని ఆయన ప్రశంసించారు. బీజేపీ, ఆరెస్సెస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే బలం తనకివ్వాలని కోరుతున్నానని.. ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేస్తానని ఖర్గే వివరించారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లను 50 ఏళ్ల వయసులోపు వారికే ఇస్తామని... రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిందని ఆయన దుయ్యబట్టారు.
నా తల్లి, సోదరుడు, సోదరిను రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో కొల్పోయానని మల్లిఖార్జున ఖర్గే గుర్తుచేశారు. రాహుల్ చేసేది భారత్ జోడో యాత్రేనని.. కుల, మతాల వారీగా బీజేపీ దేశాన్ని విభజిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. భారత్ తొడో యాత్ర అని విమర్శలు చేయడం సరికాదని... దేశం కోసం బీజేపీ, ఆరెస్సెస్ నేతలు ఏమైనా బలిదానాలు చేశారా అని ఖర్గే ప్రశంసించారు. ఇందిరా, రాజీవ్ వంటి వారు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని ఆయన గుర్తుచేశారు.