మాజీ మంత్రి దేవినేని ఉమపై మరో పోలీస్ కేసు... ఈసారి ఏంటంటే..?

By Arun Kumar PFirst Published Jun 18, 2021, 12:58 PM IST
Highlights

 మైలవరం పోలీస్ స్టేషన్ లో మాాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై సెక్షన్ 188 ఐపీసీ, 3 ఈడీఏ కింద కేసులు నమోదయ్యాయి.
 

విజయవాడ: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావుపై మరో పోలీస్ కేసు నమోదయ్యింది. పార్టీ పిలుపుమేరకు జూన్ 16వ తేదీన మైలవరంలో ఆందోళనకు దిగిన ఉమతో పాటు మిగతా నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.  కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఆందోళనకు దిగారంటూ మైలవరం పోలీసులు సెక్షన్ 188 ఐపీసీ, 3 ఈడీఏ కింద కేసులు బుక్ చేశారు.

కరోనాతో తమవారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలని... ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వైద్యం అందక చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలంటూ టిడిపి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలకు రూ.10వేల ఆర్థిక సాయం చేయాలని కూడా టిడిపి జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లను నెరవేర్చాలంటూ టిడిపి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న ఆందోళనకు దిగారు. 

ఈ క్రమంలో మైలవరంలో కూడా తన అనుచరులు, టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉమ నిరసన చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. ఈ నిరసన సమయంలోనే టిడిపి నాయకులు కోవిడ్ నిబంధనలు ఉళ్లంఘించారంటూ పోలీసులు కేసు బుక్ చేశారు. 

read more  తొందరపాటు చర్యలొద్దు, స్టే పొడిగింపు: సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశం

ఇప్పటికే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను ఫోర్జరీకి పాల్పడ్డారంటూ దేవినేని ఉమపై ఐపిసి 464, 465, 468, 471, 505సెక్షన్ల కింద సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీన ఉమ ప్రచారంలో పాల్గొని గతంలో సీఎం జగన్ తిరుపతి గురించి మాట్లాడినట్లుగా కొన్ని వీడియోలను ప్రదర్శించారు. తిరుపతికి రావడానికి ఎవరూ ఇష్టపడరంటూ జగన్ అభిప్రాయపడినట్లు సదరు వీడియోలో వుంది. అయితే ఇది మార్పింగ్ వీడియో అని వైసిపి లీగల్ సెల్ కర్నూల్ అధ్యక్షుడు సీఐడికి ఫిర్యాదు చేశారు. 

 ఎన్నికల సమయంలో మార్పింగ్ వీడియోలను ప్రదర్శిస్తూ ప్రజలను పక్కదారి పట్టించడానికి మాజీ మంత్రి ప్రయత్నిస్తున్నాడంటూ మరికొందరు వైసిపి నాయకులు కూడా సీఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో దేవినేని ఉమపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐడి అధికారి రవికుమార్ వెల్లడించారు.  ఫిర్యాదుదారులు దేవినేని ఉమ ప్రదర్శించిన వీడియో క్లిప్పింగులను తమకు అందించారని... దీని ఆదారంగా విచారణ కొనసాగిస్తామని రవికుమార్  పేర్కొన్నారు.    


 


 

click me!