మైలవరంలో ఘోరం... నిద్రిస్తున్న భార్య, అత్తామామ, మరదలిని కత్తితో నరికిన దుర్మార్గుడు

By Arun Kumar PFirst Published Oct 18, 2021, 12:29 PM IST
Highlights

కట్టుకున్న భార్యతో పాటు అత్తామామ, మరదలిపై అత్యంత కిరాతకంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడో దుండగుడు. అత్తవారింట్లో నిద్రిస్తున్న అందరిపై కత్తితో దాడిచేసి పరారయ్యాడు కసాయి అల్లుడు.  

విజయవాడ: భార్యకు కట్నం కింద ఇచ్చిన భూమిని అమ్మాలని అతడు భావించాడు. అందుకు భార్య ఒప్పుకోకుండా గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్యను భూమి అమ్మనివ్వకుండా రెచ్చగొడుతున్నారని అత్తింటివారిపై రగిలిపోయిన ఆ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. భార్యతో సహా అత్తామామ, మరదలిపై ఈ సైకో కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... krishna district మైలవరం మండలం వెదురుబీడెం గ్రామానికి చెందిన ఏడుకొండలు కూతురిని రాంబాబు వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో కట్నం కింద కొంత భూమిని కూతురు పేరుమీదే రిజిస్టర్ చేయించి ఇచ్చాడు ఏడుకొండలు. 

అయితే ఆ భూమిని అమ్మేయాలని రాంబాబు ప్రయత్నిస్తున్నాడు.  కానీ పుట్టింటివారు కట్నంగా ఇచ్చిన భూమిని అమ్మేందుకు ఒప్పుకోలేదు.  ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి భూమి అమ్మకం విషయంలో భార్యాభర్తలకు గొడవ జరిగింది. దీంతో ధనలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది.  

వీడియో

అయితే భార్య తన నిర్ణయానికి అడ్డుచెప్పి పుట్టింటికి వెళ్లిపోవడంతో రగిలిపోయిన రాంబాబు దారుణానికి ఒడిగట్టాడు. సోమవారం తెల్లవారుజామున అత్తవారింటికి చేరుకున్న అతడు నిద్రిస్తున్న అత్తామామ, భార్య,మరదలిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రక్తపుమడుగులో పడి గిలగిలా కొట్టుకుంటున్నా ఏ మాత్రం జాలి లేకుండా అక్కడినుండి పరారయ్యాడు. 

read more  వైద్యం పేరుతో మహిళపై అత్యాచారయత్నం, నరికి చంపిన భూతవైద్యుడు.. కోపంతో ఆ గ్రామస్తులు చేసిన పని..

అయితే చుట్టుపక్కల ఇళ్లవారు వీరి అరుపులు విని వచ్చిచూసేసరికి కుటుంబసమంతా రక్తపుమడుగులో తీవ్ర గాయాలతో పడివున్నారు. దీంతో వారు 108కు ఫోన్ చేయగా అంబులెన్ వచ్చింది.  అందులో వారిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. 

అయితే తీవ్రంగా గాయపడ్డ మామ ఏడుకొండలు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతావారిలో కూడా అత్త, భార్య పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.  

ఈ దారుణంపై సమాచారం అందుకున్న మైలవరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆదారాలను సేకరించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు రాంబాబు పరారీలో వున్నాడు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

click me!