
కర్నూలు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సినీ క్రిటిక్ మహేష్ కత్తి వదిలిపెట్టడం లేదు. తాజాగా ఆయన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాదిగ జేఏసీ ఆదివారం నిర్వహించిన మాదిగ రాజకీయ చైతన్య సభకు మహేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎవరు డబ్బులిస్తే వారివైపు మాట్లాడడం పవన్ కల్యాణ్ కు అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ నాయకులు ఇప్పుడు పవన్ను పోషిస్తున్నారని మహేష్ కత్తి అన్నారు. వచ్చే రెండు మూడు నెలల్లో ఇది కూడా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎవరితో జతకడతాడో తెలియదని, తన స్వార్థం కోసమే రాజకీయాల్లోకి వచ్చాడని విమర్శించారు.
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మంది ఓటర్లను కూడా పవన్ కల్యాణ్ ప్రభావితం చేయలేరని మహేష్ కత్తి అన్నారు. రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన టీడీపి అధినేత చంద్రబాబు మాదిగలను మోసం చేశారని, మాదిగల గురించి మాట్లాడాలంటేనే జగన్ భయపడుతున్నారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో తాను చిత్తూరు పార్లమెంటు సీటుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వైసీపీ లేదా కాంగ్రెస్ ఎవరు టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరి పోటీ చేస్తానని చెప్పారు.
5 వేల నుంచి 6 వేల ఓట్లున్న మనమెందుకు సవాల్ చేయకూడదని మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. మాదిగలను పట్టించుకునే వారికే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.