రాష్ట్రానికి పొంచివున్న మిడతల ముప్పు...ఇలా చేస్తేనే నివారించగలం: జగన్ కు లోకేశ్ లేఖ

By Arun Kumar PFirst Published May 29, 2020, 7:15 PM IST
Highlights

మిడతల దండు ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలపై దాడిచేయగా తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొంచివున్న ముప్పును నియంత్రించేందుకు చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరిస్తూ నారా లోకేశ్ సీఎం జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. 

అమరావతి: రాష్ట్రానికి పొంచివున్న మిడతల ముప్పును నివారించడంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సూచించారు. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఆయన ముఖ్యమంత్రికి ఓ బహిరంగ లేఖ రాశారు. 

''మిడతల దండు ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలపై దాడి చేసింది. మహారాష్ట్ర నుంచి ఆ దండు తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనంతపూర్ లోని రాయదుర్గం లో మిడతలు ప్రవేశించాయనే వార్తలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి'' అని తెలియజేశారు. 

read more  రాయదుర్గంలో మిడతల కలకలం: ఆందోళనలో స్థానికులు

''రాష్ట్రంలో కరోనా నివారణను తేలిగ్గా తీసుకోవడంతో ఇప్పటికే చాలా నష్టం వాటిల్లింది. పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ వ్యాఖ్యలు రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీశాయి. మిడతల దండు ప్రభావం భయంకరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే  డ్రోన్లతో పురుగుమందు పిచికారీ సూచించటంతో పాటు రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర హెచ్చరికలు, పొరుగు రాష్ట్రాల విధానాలు పట్టించుకోకుండా ఏడాది వేడుకలు, పబ్లిసిటీ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''ముంచుకొచ్చే ప్రమాదం నివారణకు రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. వ్యవసాయ రంగాన్ని అప్రమత్తం చేసి రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలి. పరిస్థితిని అధ్యయనం చేయటానికి జిల్లా యంత్రాగాన్ని సిద్ధం చేయాలి. మిడతల ప్రభావిత రాష్ట్రాలు, దేశాలతో సమన్వయం చేసుకోవాలి. సాంకేతికతను వినియోగించుకుంటూ పరిష్కారాలు చేపట్టాలి'' అని సీఎం జగన్ కు పలు సూచనలిచ్చారు నారా లోకేశ్. 

click me!