
Land Grabbing Allegations Against Roja's Family: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా కుటుంబంపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. వివరాల్లోకెళ్తే..టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలోని ఆర్కే రోజాపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో ప్రజల నుంచి వందలాది వినతులు అందగా, ముఖ్యమైన కేసు మాత్రం మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆమె భర్త సెల్వమణిపై వచ్చిన ఆరోపణలుగా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలింబాక గ్రామానికి చెందిన ఇల్లత్తు గుణశేఖర రెడ్డి అనే రైతు తన ఫిర్యాదులో మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి, నగరి మున్సిపల్ చైర్మన్, మీనాకుమార్ లు తన కుటుంబ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి రేకుల షెడ్ నిర్మించారని పేర్కొన్నారు.
తమ కుటుంబం దీన్ని అడ్డుకున్నప్పటికీ, పోలీసులు వీరికి బదులు తమనే స్టేషన్కు తీకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మార్లు ఆర్డీఓ, తహశీల్దార్ల వద్ద ఫిర్యాదు చేసినా స్పందన లేదని, తమకు భూ హద్దులు నిర్ణయించి న్యాయం చేయాలని విన్నవించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో పౌరుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అందాయి. వివిధ సమస్యలపై ప్రజలు దాఖలు చేసిన అర్జీలను బయోడైవర్శిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ స్వయంగా స్వీకరించారు. సమస్యలను గమనించిన వెంటనే ఆయన సంబంధిత అధికారులను ఫోన్లో సంప్రదించి, వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని స్పష్టంగా ఆదేశించారు. ప్రజల సమస్యలపై స్పందనతో పాటు, పరిష్కారానికి కృషి చేసిన ఆయన చర్యలు అభినందనీయంగా నిలిచాయి.