ఏపీలో అధికారం, ఢిల్లీతో మాకెందుకు.. భారతమ్మకి అంత ఖర్మ పట్టలేదు: టీడీపీ నేతలకు కొడాలి నాని కౌంటర్

By Siva KodatiFirst Published Sep 9, 2022, 8:00 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో వైఎస్ భారతికి సంబంధమేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని . ఏపీతో పోల్చుకుంటే ఢిల్లీ ఎంత.. ఇక్కడ వుండే సేల్స్ ఎంత, అక్కడ వుండే సేల్స్ ఎంత అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి వైన్ షాపులకు లైసెన్స్ అడిగే ఖర్మ వైఎస్ భారతికి లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. 
 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో వైఎస్ భారతికి సంబంధమేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ వెళ్లి వైన్ షాపులకు లైసెన్స్ అడిగే ఖర్మ ఆమెకు లేదన్నారు. ఒక రాష్ట్రంలో అధికారంలో వుండి , ఢిల్లీకి వెళ్లి స్కామ్‌లో వాటా అడుక్కుంటారా అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌ను జైల్లో పెట్టి ఏం సాధించారని కొడాలి నాని నిలదీశారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు కుప్పంలో... లోకేష్ మంగళగిరిలో గెలవరని నాని జోస్యం చెప్పారు. ఏపీతో పోల్చుకుంటే ఢిల్లీ ఎంత.. ఇక్కడ వుండే సేల్స్ ఎంత, అక్కడ వుండే సేల్స్ ఎంత అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వెళ్లి కేసీఆర్‌నో, స్టాలిన్‌నో అడుక్కుంటాడంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. రెండు వైన్ షాపులిస్తే హెరిటేజ్ మజ్జిగ అమ్మినట్లు అమ్ముతామని అడుగుతాడంటూ మాజీ మంత్రి సెటైర్లు వేశారు. జగన్ నిలువెత్తు నిప్పులాంటి వాడని ఆయన ప్రశంసించారు. 

అంతకుముందు.. అమరావతిని మహానగరాలతో పోల్చి చంద్రబాబు ఆశలు కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు కొడాలి నాని. 23 సీట్లకే టీడీపీని పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ధిరాలేదని నాని ఫైరయ్యారు. 29 నియోజకవర్గాలున్న నగరాలెక్కడ...? 29 గ్రామాలున్న అమరావతి ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. వైజాగ్ సిటీలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయని.. అక్కడ పదివేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రానికి సంపద సృష్టిస్తుందని కొడాలి నాని అన్నారు. 

ALso REad:మూడు రాజధానులు జరిగి తీరుతాయ్.. 2024లోపే బిల్లు : తేల్చేసిన కొడాలి నాని

పరిపాలనా రాజధానిని విశాఖకు తీసుకెళ్లడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ పరిపాలన రాజధానైతే ఆ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కొడాలి నాని పేర్కొన్నారు. మాకు అమరావతి ఎంతో విశాఖ, కర్నూలు కూడా అంతేనని మాజీ మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబుకు భజన చేస్తున్న ఎల్లో మీడియా ట్రాప్‌లో పడొద్దని కొడాలి నాని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టాలనే దానిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. న్యాయ నిపుణుల సలహాలను తీసుకుని మూడు రాజధానుల విషయంలో ముందుకెళ్తామని కొడాలి నాని అన్నారు. 
 

click me!