మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్లున్నాడు. తొందర్లోనే ప్రకటన వెలువడుతుందట.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని చాలా మంది మర్చిపోయారు. ఆయన లేని లోటు కూడా ఎవరికి కనిపించడం లేదు. మీడియా వాళ్లు కూడా ఏ విషయం మీద ఆయన బైట్ తీసుకున్నట్లు లేదు. నిజానికి ఆయనకు ఎక్కడ ఉచితాసనం లేదు. కాకపోతే, ఏ పార్టీలో చేరినా మాజీ ముఖ్యమంత్రి గా వేదిక మీద తప్పక సీటుంటుంది. మాట్లాడే అవకాశమిస్తారా అనేది అనుమానమే. ఎందుకంటే, ఆయన మాట్లాడితే అర్థం కావడం కష్టం. తెలుగును ఆయన లాగా మాట్లాడే నాయకుడెవరే ఇంతవరకు తయారు కాలేదు తెలుగునాట. ఆయన ఇంగ్లీషులో మాట్లాడినా అర్థమవుతుందేమోగాని, తెలుగులో మాట్లాడితే మాత్రం శ్రోతలకు కష్టాలే.
అంత ఈజీగా అర్థమయ్యేలా మాట్లాడక పోవడం ఆయన ప్రత్యేకత. తెలంగాణా విభజన తర్వాత, ఆయననెవరూ పట్టించుకొనక పోవడానికి కారణం కూడా ఇదేనేమో.
ఆయన కూడా రాజకీయాలను అంతసీరియస్ గా తీసుకుంటున్నట్లు లేదు. అందుకే, తాను అట్టహాసంగా ప్రకటించిన ఆరువేల కోట్ల చిత్తూరు జిల్లా మంచినీటి పథకం ఒక చెత్త పథకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన్ని తగలేస్తే మాట వరసకు కూడా నిరసన తెలపలేదు.
అయితే,చిత్తూరు జిల్లాలోని ఒక మారు మూల గ్రామంలో తన రాజకీయ పునరాగమమం గురించి సూచన ప్రాయంగా చెప్పారు. అదీకూడా తన పద్ధతిలోనే. బుధవారం నాడు గుర్రం కొండ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వచ్చిన వాళ్లంతా ఆయన అభిమానులే. ఏ జండా పట్టుకోకుండా రెండేళ్లుగా ఉండటం కష్టంగా ఉందని, ఇలా ఎల్లకాలం లాగించడం బాగుండదని,ఏదో గూట్లోకి మీరూ దూరండి, మమ్మల్ని లాగండని ఒక అభిమాని సిగ్గుపడుతూనే అడిగాడట.అపుడు ఆయన తన సహజశైలిలో ఇలా జవాబిచ్చాడు.
‘పెళ్లి గురించి మాట్లాడాము, పెళ్లికూతురు పేరు గోప్యం. తాళిబొట్టు కట్టే తేది ఖారారైతే మీకందరికి శుభలేఖలు వస్తాయి కదా తొందరెందుకు,’ అన్నారట.
దీని భావమేమిటో తెలియక ఆ పల్లెటూరి కార్యకర్తలు నానా అగచాట్లు పడ్డట్టుంది. కొందరమే ఆయన వైకాపాలోకి వెళ్లవచ్చని, మరికొందరు తెలుగుదేశం పార్టీ యే ఆయనకు తగిన పార్టీ యని, , కొంద రే మో ఎక్కడికి పోతాడు పాత గూటికే అని అనుకున్నారు. ఇంకొందరేమో బిజెపి దగ్గిర పెండింగులో ఉన్న దరఖాస్తుకేమమయిన ఆమోదం లభించేందేమోని అనుమానించారట.
కొసమెరుపు, ఈ మారుమూల గ్రామంలో కూడా అభిమానులే కాదు గిట్టని వాళ్లు కూడా దాక్కున్నటన్నట్లుంది. మళ్లీ కనిపిస్తున్నావా అని ఆయన మీద కోడిగుడ్డు విసిరారని మీడియా కథనం. పంచాయతీ కార్యాలయానికి వస్తుండగా కోడిగుడ్డు విసిరారట.